ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రీ-డి సాంకేతికతతో భవన నిర్మాణం,,,,ఐఐటీ మద్రాసు సహకారంతో పూర్తి

national |  Suryaa Desk  | Published : Fri, Aug 18, 2023, 09:08 PM

దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ భవనాన్ని కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం ప్రారంభించారు. ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా నిర్మించిన ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ హాజరయ్యారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో బెంగళూరులో ప్రింట్ చేసిన ఈ భవంతిని కేవలం 45 రోజుల్లో పూర్తిచేసినట్లు చెప్పిన మంత్రి... నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. బెంగళూరులోని హాలాసూర్ కేంబ్రిడ్జి లే అవుట్‌లో దాదాపు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ త్రీడీ బిల్డింగ్‌ను రూపొందించారు.


ప్రముఖ సంస్థ ఎల్‌ అండ్ టీ కంపెనీ 3డి కాంక్రీట్ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి ఈ నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఈ త్రీడీ బిల్డింగ్ ఒక నిదర్శనమని ఆయన చెప్పారు. దేశానికి కొత్తదనాన్ని పరిచయం చేయడంలో బెంగళూరు ఎప్పుడూ ముందుంటుందని, త్రీడీ పోస్టాఫీసు బిల్డింగ్‌తో దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని కేంద్ర మంత్రి కొనియాడారు. యావత్ దేశం ఇదే స్ఫూర్తితో పురోగమిస్తోందని పేర్కొన్నారు.


‘అభివృద్ధి స్ఫూర్తి.. మన స్వంత సాంకేతికతను అభివృద్ధి చేసే స్ఫూర్తి.. గతంలో అసాధ్యమని భావించిన పనిని చేసే స్ఫూర్తి.. ఈ కాలంలోని నిర్వచించే లక్షణం’ అని అన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లో తాము ప్రతిపాదించిన త్రీడీ బిల్డింగ్ ప్లాన్ కు బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ (బీఎంటీపీసీ) ఆమోదం తెలపగా.. ఐఐటీ మద్రాస్ సహకారంతో పూర్తిచేసినట్లు ఎల్ అండ్ టి కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.


3డీ-కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించిన ఈ భవనంలో పూర్తిగా ఆటోమేటెడ్ నిర్మాణ సాంకేతికతను వినియోగించారు. రోబోటిక్ ప్రింటర్ ఆమోదించిన డిజైన్ ప్రకారం లేయర్-బై-లేయర్‌‌తో త్వరగా గట్టిపడే ప్రత్యేక కాంక్రీట్ నిర్మాణం చేపడతారు. ఖర్చు, సమయం ఆదా చేయడం వల్ల 3డీ-కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికత సంప్రదాయ నిర్మాణ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా మారింది.


‘సైట్‌లో 3డి-ప్రింటెడ్ కాంక్రీట్ భవనాన్ని నిర్మించడం గొప్ప చొరవ.. ఇది టెక్నాలజీ గొప్పదనం.. ఐఐటి మద్రాస్ దీనిపై అద్భుతంగా పని చేసింది. ఈ సాంకేతికత వినియోగంలోకి వచ్చినప్పుడు.. దీనిని ముందుకు తీసుకెళ్లడంలో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను మున్ముందు చూస్తాం’ వైష్ణవ్ అన్నారు. భారత్ స్వంతంగా 4జీ, 5జీ సాంకేతికతను అభివృద్ధి చేస్తుందని ఎవరూ ఊహించలేదని కూడా మంత్రి అన్నారు. ‘భారత్ తన సంక్లిష్టమైన టెలికాం పరికరాలను తయారు చేస్తుందని ఎవరూ ఊహించలేదు.’ అని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa