ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆహారంలో చేపలు తీసుకుంటే.. ఐశ్వర్యరాయ్‌ లాంటి కళ్లు : మంత్రి

national |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 10:16 PM

సినిమా హీరోలు, హీరోయిన్లను పోల్చి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. మరికొన్నిసార్లు సినిమా డైలాగ్‌లు వేసి కార్యకర్తలు, ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. అయితే ఇలాంటప్పుడే ఆచితూచి మాట్లాడకపోతే విమర్శలు, నవ్వుల పాలు అవుతూ ఉంటారు. ఇలాంటి సంఘటనే ప్రస్తుతం ఒకటి జరిగింది. రోజూ తినే ఆహారంలో చేపలు ఉండేలా చూసుకోవాలని మహారాష్ట్ర మంత్రి ఒకరు పేర్కొన్నారు. అలా చేస్తే బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌ లాంటి అందమైన కళ్లు సొంతం అవుతాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రి వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.


మహారాష్ట్ర గిరిజనశాఖ మంత్రి విజయ్‌కుమార్‌ గవిత్‌ నందుర్బార్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో మాట్లాడారు. అయితే ప్రజలకు ఆహారం.. అందులో తీసుకోవాల్సిన ఇతర పదార్థాల గురించి వివరించారు. ఇలా వివరిస్తూ ఒక వింతైన పోలిక పోల్చారు. నిత్యం మనం తినే ఆహారంలో చేపలను తప్పకుండా ఉండేలా చూసుకోవాలని సూచన ఇచ్చారు. రోజూ చేపలు తినేవారి చర్మం చాలా మృదువుగా మారుతుందని తెలిపారు. అంతే కాకుండా కళ్లు కూడా మెరుస్తాయని పేర్కొన్నారు. ఇతరులు ఎవరైనా చూస్తే వారు మీ పట్ల ఆకర్షణకు లోనవుతారని విచిత్ర వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్బంగానే బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ భార్య, నటి ఐశ్వర్యరాయ్‌ గురించి చెప్పడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఐశ్వర్య రాయ్ మంగళూరులోని సముద్ర తీరంలో నివసించేదని.. అందుకే రోజూ చేపలు తినేదని తెలిపారు. ఒకసారి ఐశ్వర్య రాయ్ కళ్లు చూస్తే తెలుస్తుంది. మీరు కూడా రోజూ చేపలు తింటే ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన కళ్లు మీ సొంతమవుతాయని సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే చేపల్లో ఉండే కొన్ని రకాల నూనెలు చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తాయని గిరిజిన శాఖ మంత్రి విజయ్ కుమార్ గవిత్ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాల్లో తెగ వైరల్‌గా మారాయి.


అయితే మంత్రి విజయ్ కుమార్ గవిత్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా విజయ్ కుమార్ గవిత్ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్సీపీ నేత అమోల్ మిత్కారీ.. ఇలాంటి పనికి రాని మాటలు చెప్పి కాలం వెళ్లదీసే బదులు.. గిరిజనుల సమస్యలపై మంత్రి దృష్టి సారించాలని హితవు పలికారు. ఇదే విషయంపై బీజేపీ ఎమ్మెల్యే నితేశ్‌ రాణే వ్యంగ్యంగా స్పందించారు. తాను రోజూ చేపలు తింటానని.. తన కళ్లు కూడా ఐశ్వర్యరాయ్‌ కళ్ల లాగా మారే అవకాశం ఉందా అని మంత్రిని ప్రశ్నించారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మంత్రి చెప్పింది కరెక్టేనని కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. ఓ మంత్రి పదవిలో ఉండి చేయాల్సింది ఇలాంటి వ్యాఖ్యలేనా అని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa