చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరులో బైక్పైవెళుతున్న ఓ కుటుంబాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడిపిన వ్యక్తి ఘటనా స్థలంలోనే చనిపోగా.. మరో ఇద్దరు మహిళలు డివైడర్ పక్కన పడి ప్రాణాలు రక్షించుకుంది. చిన్న పాపం లారీ మధ్య భాగంలో పడటంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్గా మారింది. పట్టణంలోని రంగాపురానికి చెందిన సద్దాం కదిరప్ప ఆస్పత్రి ఎదురుగా చికెన్ స్టాల్ను ఇటీవలే ప్రారంభించాడు. కుటుంబసభ్యుల సహకారంతో షాపును నిర్వస్తున్నాడు. సోమవారం సాయంత్రం షాపు నుంచి సద్దాం, భార్య రుక్సార్, అత్త ఫాతిమా, తన ఇద్దరు పిల్లలతో బైక్పై ఇంటికి బయలుదేరాడు. రంగబాబు సర్కిల్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తుండగా పలమనేరు వైపు ఇనుప కమ్మీతో వస్తున్న లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో బైక్ ట్యాంక్పై కూర్చున్న సద్దాం కుమార్తె సారా హర్మీన్ లారీ కింద మధ్యలో పడి స్వల్పగాయాలతో బయటపడింది. బైక్పై వెనుక కూర్చున్న భార్య రుక్సార్, ఆమె తల్లి ఫాతీమా, భార్య చేతిలో ఉన్న 11నెలల చిన్నారి అలియా పక్కనే ఉన్న డివైడర్పై పడడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. సద్దాం తలపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఇంజిన్ కూడా ఆఫ్ చేయకుండా లారీలోంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు.
వెంటనే స్థానికులు అప్రమత్తమై.. అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిని మండలంలోని గొల్లపల్లికి చెందిన డ్రైవర్ సురేష్గా గుర్తించారు. స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లో లారీ టైర్లను మార్చి బైపాస్ మీదుగా వచ్చి పట్టణం మీదుగా ట్రయల్స్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa