ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరవకొండలో ఓట్ల తొలగింపు వ్యవహారం,,,మరో మహిళా అధికారి సస్పెన్షన్‌ ఉత్తర్వులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 09:03 PM

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపు వ్యవహారం మరో మలుపు తిరిగింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం మరో మహిళా అధికారిపై సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో అనంతపురం జెడ్పీ సీఈవోగా పనిచేస్తూ ఉరవకొండ నియోజకవర్గానికి ఈఆర్‌వో (ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి) వ్యవహరించిన శోభ స్వరూపారాణిని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ఈ నెల 19న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేయగా.. వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. శోభ స్వరూపారాణి సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ విడిచిపెట్టి వెళ్లొద్దని ఆదేశించారు.


కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధివిధానాలు పాటించకుండా.. 2020, 2021లో 1,796 ఓట్లు తొలగించినట్లు విచారణలో తేలిందట. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. శోభా స్వరూపారాణి ప్రస్తుతం బాపట్లలోని ఈటీసీ (ఎక్స్‌టెన్షన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌) లో గెజిటెడ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2020, 2021 సంవత్సరాల్లో ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో టీడీపీ మద్దతుదారుల ఓట్లను భారీగా తొలగించారని ఆ పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ గతేడాది అక్టోబరు 27న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.


ఈ ఏడాది జనవరి 4న ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలకు ఆదేశించింది. ఇప్పటికే అనంతపురం జిల్లా పరిషత్‌ ప్రస్తుత సీఈవో, ఈఆర్‌వో కె.భాస్కర్‌రెడ్డిని ఇటీవల సస్పెండ్‌ చేశారు. తాజాగా స్వరూపారాణిని కూడా సస్పెండ్ చేశారు. అయితే ఈ సస్పెన్షన్‌ వ్యవహారంపై ఆమెస్పందించారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు బాధ్యురాలిని చేస్తూ తనపై సస్పెన్షన్‌ వేటు వేసిన విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యురాలిని చేస్తూ తనను ఎవరూ వివరణ కోరలేదన్నారు.


అనంతపురం జిల్లా పరిషత్ ప్రధాన ఎన్నికల అధికారి కె.భాస్కర్ రెడ్డిపైనా ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలోనే ఈయనపైనే వేటు పడింది. కొంతకాలంగా ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓట్ల తొలగింపు అంశంపై ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడం కలకలంరేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa