దేశంలో ప్రస్తుతం ఉల్లి ధరలు ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉల్లి ధరలతో సామాన్య జనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం టమాటా ధరలు ఆల్టైమ్ హైని చేరుకుని ప్రజలకు చుక్కలు చూపించగా.. ప్రస్తుతం అదే పరిస్థితి ఉల్లి చూపిస్తోంది. దీంతో ఏం కొనలేని పరిస్థితి నెలకొందని సామాన్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉల్లి ధరల పెరుగుదలపై ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. పెరుగుతున్న ఉల్లి ధరలతో వాటిని కొనలేని వారు కొన్ని నెలల పాటు ఉల్లిని తినడం మానేయాలని ఓ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై ప్రజలు, నెటిజన్లు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ మంత్రి మాట్లాడేది ఇలాంటి మాటలేనా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
దేశంలో ఉల్లి ధరల పెరుగుదలపై కొనుగోలుదారులను ఉద్దేశించి మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి దాదా భూసే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఉల్లిని కొనలేని వారు కొన్నాళ్ల పాటు ఉల్లికి దూరంగా ఉంటే ఏ సమస్య ఉండదని చెప్పడం సంచలనంగా మారింది. రూ.10 లక్షల కారు కొనగలిగినవారికి రిటైల్ ధర రూ.10 నుంచి 20 పెరిగితే ఏ సమస్యా ఉండదన్నారు. అదే కొనలేనివారు ఓ 4 నెలలు ఉల్లికి దూరంగా ఉంటే సరిపోతుందని ఉచిత సలహా ఇచ్చారు. ఒకసారి ఉల్లి ధర క్వింటాల్కు రూ.200 మాత్రమే ఉంటుందని.. మరికొన్ని సార్లు అది రూ.2 వేల వరకు పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమస్య గురించి చర్చించి దీనికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. ఎగుమతి సుంకాన్ని పెంచి ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి దాదా భూసే చెప్పారు. దీనిపై సామాన్య ప్రజలతో పాటు సోషల్ మీడియాలో సదరు మంత్రి తీవ్రంగా విమర్శల పాలయ్యారు.
మరోవైపు.. కేంద్రం ఉల్లి ధరలపై ఎగుమతి పన్నును 40 శాతానికి పెంచడంతో రైతులు ఆందోళన చేపట్టారు. దీనికి తోడు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో కిలో ఉల్లిని రూ.25కే అందిస్తామని ప్రకటించింది. మహారాష్ట్రలో అతి పెద్దదైన హోల్సెల్ మార్కెట్తో సహా ఉల్లి వేలాన్ని నిలిపివేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని నాసిక్ జిల్లా ఆనియన్ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఉల్లి ఎగుమతులపై కేంద్రం విధించిన 40 శాతం సుంకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa