ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను ఆపేసిన పోలీసులు,,,సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 09:47 PM

రోడ్లపై ఎంత ట్రాఫిక్ జాం ఏర్పడినా.. ఎలాంటి సెలబ్రిటీలు వెళ్లినా ఖచ్చితంగా అంబులెన్స్ సైరన్ వినగానే దానికి దారి ఇస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అంబులెన్స్ కోసం ట్రాఫిక్‌ను ఆపేసిన సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌ను ఒక్క క్షణం కూడా ఆపకుండా వేగంగా ఆస్పత్రికి తరలించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తారు. అలా చేస్తే అందులో ప్రాణాలతో కొట్టుమిట్టాడే వారు సకాలంలో హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటే బతుకుతారనే ఒక ఆశ ఉంటుంది. అయితే అలాంటి అంబులెన్స్‌ను పోలీసులు ఆపేశారు. అది కూడా సీఎం కాన్వాయ్ అటుగా వస్తుందని ఆపేయడంతో ఆ అంబులెన్స్‌ డ్రైవర్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో ఉంచాడు. ఇప్పుడు ఇది కాస్త తెగ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి.


ఈ ఘటన బిహార్ రాజధాని పాట్నాలో జరిగింది. అయితే ప్రాణాపాయంలో ఉన్న ఓ రోగిని ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ వేగంగా వస్తోంది. ఎలాగైనా అంబులెన్స్‌లో ఉన్న రోగి ప్రాణాలను కాపాడాలని దాని డ్రైవర్ పట్టుదలగా ఉన్నాడు. అయితే అదే సమయంలో అటుగా సీఎం కాన్వాయ్ వెళ్తోందని పోలీసులు ఆ అంబులెన్స్‌ను ఆపేశారు. అయితే అంబులెన్స్‌లో రోగి ఉన్నాడని.. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించకపోతే ప్రాణాలకే ప్రమాదమని అంబులెన్స్ డ్రైవర్, రోగి కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకున్నారు. అయితే అందుకు ఆ పోలీసులు ఒప్పుకోలేదు. దీనికి తోడు అన్ని వాహనాలను ఆపేసి.. సీఎం కాన్వాయ్‌ను ఎలాంటి అడ్డకులు లేకుండా పంపించారు.


అయితే సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్ కోసం తమ వాహనాన్ని ఆపేశారని అంబులెన్స్ డ్రైవర్.. ఆ ఘటనకు సంబంధించి మొత్తాన్ని వీడియో తీశాడు. అందులో ఆ రోగి కుటుంబ సభ్యులు ఏడుస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోను కాస్త సోషల్ మీడియాలో ఉంచడంతో అది వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్స్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రోగిని వదిలిపెట్టలేదని పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్ల నుంచే కాకుండా ప్రతిపక్షాలు కూడా ఈ వీడియో చూసి బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.


అయితే ఈ వీడియోను షేర్ చేసిన బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగి ప్రాణాలతో పోరాడుతూ ఉండగా.. కుటుంబ సభ్యులు ఏడుస్తున్నా.. బిహార్‌ సీఎం నితీశ్ కుమార్ కనీస మానవత్వం ప్రదర్శించలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది చాలా అవమానకరమని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే సీఎం కాన్వాయ్‌ పూర్తిగా వెళ్లిన తర్వాత అంబులెన్స్‌ను వదిలేయడంతో అది ఆస్పత్రికి పంపించారు. అయితే ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా బిహార్‌ ప్రభుత్వం గానీ.. నితీశ్‌కుమార్‌ కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa