ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మడలం కొండపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ టైర్ మీద పడి ఓ రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. నిలబెట్టి ఉన్న ట్రాక్టర్ టైర్తో సరదాగా ఆడుకున్న చిన్నారి.. అదే టైరు కింద పడి చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. కొండపల్లి ఐడీఏ పోస్టాఫీస్ సందులో ఉన్న ఓ ట్రాక్టర్ కంపెనీలో జోజి అనే వ్యక్తి వాచ్మెన్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య.. ముగ్గురు పిల్లలు. ట్రాక్టర్ కంపెనీలోని ఓ గదిలోనే నివాసం ఉంటూ అక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. భార్య స్వప్నకు ఇటీవల ప్రసవం కాగా.. ఆమె పుట్టింట్లో ఉంది.
జోజి మాత్రం తన నాలుగేళ్ల కూతురు శ్రీరాణి, రెండేళ్ల కుమారుడు ఇస్సాతో కలిసి ట్రాక్టర్ కంపెనీలోనే ఉంటున్నాడు. అయితే కుమారుడు ఇస్సా గతరాత్రి (సెప్టెంబర్ 3న) ట్రాక్టర్ టైర్తో ఆడుకుంటూ అది మీదపడి ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ముందుగా తండ్రితో కలిసి ఇస్సా గది బయటకు వస్తాడు. తండ్రి జోజి గేటు బయటకు వెళ్లగా.. అక్కడే నిలబెట్టిన ఉన్న ఓ ట్రాక్టర్ టైర్తో బాలుడు కాసేపు ఆడుకుంటాడు. టైర్లో కూర్చొని అటు ఇటూ సరదగా ఆడుకుంటాడు.
ఇంతలో అక్కడకు ఓ వీధి కుక్క వస్తుంది. దాన్ని చూసి భయపడిపోయిన చిన్నారి.. టైర్లో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఓ పక్కకు ఒరగబెట్టి ఉన్న టైర్ ఎడ్జ్పై నిల్చొని కిందకు దిగే ప్రయత్నం చేస్తాడు. అయితే బాలుడు దిగే క్రమంలో టైరు కూడా అతడి వెంటే వచ్చి తల మీద పడిపోయింది. కింద కాంక్రీట్ నేల కావటం పైనుంచి టైరు బలంగా పడటంతో బాలుడి తలకు తీవ్ర గాయాలు అవుతాయి. అది గమనించిన ఓ వ్యక్తి వెంటనే బాలుడిని పైకి లేపి ఆసుపత్రికి తరలించినా.. ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa