మూడు నెలల పాటు సామాన్యులను కన్నీళ్లు పెట్టించిన టమాటా.. నేడు రైతులను కన్నీళ్లకు గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకూ మార్కెట్లో రూ.200 పలికిన కిలో టమాటా.. నేడు ధరలు లేక వెలవెలబోతోంది. కనీసం రవాణా ఛార్జీలు రావడం కూడా గగనంగా మారడంతో పంటను రోడ్డుపై పారబోసే పరిస్థితి నెలకుంది. తాజాగా, నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు తాము తీసుకొచ్చిన టమాటాలను అక్కడే పారబోసి వెళ్లిపోయారు. దీంతో వాటిని పశువులు మేస్తూ కనిపించాయి.
ధరలు భారీగా పతనమయ్యాయని, పంట కోత, రవాణా ఖర్చులు సైతం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్లో కిలో టమాటా రూ.3 పలికితే.. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో ధర భారీగా పతనమయ్యింది. 25 కిలోల టమాటా బాక్సు రూ.10 నుంచి రూ.35 వరకూ పలుకుతుండటం గమనార్హం. అంటే కేజీ టమాటా దాదాపు 30 నుంచి 40 పైసలే. దీంతో గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై టమాటాలను రైతులు పారబోస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లోనూ ఇదే పరిస్థితి నెలకుంది.
జూన్ రెండో వారం నుంచి టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగి.. సామాన్యులకు చుక్కలు చూపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 200 దాటింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో రూ. 250 నుంచి రూ.300 వరకు పలికిన సందర్భాలున్నాయి. ఆగస్టు రెండో వారం వరకు కొండెక్కి కూచోవడంతో టమోటాలవైపు కన్నెత్తి చూడటానికి జనం జడిసిపోయారు. కానీ, గత రెండు వారాల నుంచి టమాటా ధర నేల చూపులు చూస్తూ.. సీన్ పూర్తిగా మారిపోయింది.
కొండెక్కిన టమాటా గిట్టుబాటు ధరలు లేక పారబోసే స్థాయికి చేరుకుంది. మార్కెట్లోకి భారీగా సరుకు పోటెత్తుతుండగా.. ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు రాక టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నెల కిందటి వరకూ క్వింటాళ్ల కొద్దీ టమాటాలు తీసుకొచ్చి.. సంచులతో డబ్బులు తీసుకెళ్లారు. కానీ, ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పెరిగిన టమాటా ధరలు రైతులకు కాసుల పంట కురిపించాయి. ఊహకందని ధరలతో ఏళ్లుగా వెంటాడిన దరిధ్రం వదిలేసి.. రైతులు కోటీశ్వరలయ్యారు. ఇదే విషయాన్ని రైతులు స్వయంగా వెల్లడించారు. టమోటాకు ఇంత ధర ఎప్పుడూ లేదని, తమ కష్టాలన్నీ తొలగిపోయాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa