కరోనా రాక ముందు జీవితం వేరు.. వచ్చాక వేరు అన్నంతగా పరిస్థితి మారిపోయింది. కోవిడ్ తగ్గాక అన్ని రకాల ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. పెట్రోల్ ధరలు పెంచిన ప్రభావం.. అకాల వర్షాలు, ఇతరత్రా.. కారణం ఏదైనా సరే ఖర్చులు మాత్రం తడిసి మోపడవుతున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు ఈ ఖర్చులు భరించలేనంతగా మారాయి. ప్రతి నెలా పెరుగుతున్న ఇంటి ఖర్చులు.. ఆగస్టులో మరింతగా పెరిగాయని యాక్సిస్ మై ఇండియా కన్జూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ సర్వేలో వెల్లడైంది. గత ఐదు నెలల ఇంటి ఖర్చులను పోల్చి చూస్తే.. ఆగస్టులో మరింత ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వే తెలిపింది.
దేశం మొత్తం మీద 58 శాతం కుటుంబాలు ఆగస్టు నెలలో ఇంటి ఖర్చు పెరిగిందని చెప్పాయి. అంతకు ముందు రెండు నెలలతో పోలిస్తే ఆగస్టులో ఇంటి ఖర్చు రెండు శాతం పెరిగింది. దేశం మొత్తం మీద దక్షిణాదిలో ముఖ్యంగా.. ఏపీ, తెలంగాణల్లో ఇంటి ఖర్చులు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 71 శాతం కుటుంబాలు ఇంటి ఖర్చు పెరిగిందని వాపోగా.. తెలంగాణలో 67 శాతం కుటుంబాలు ఇదే మాట చెప్పాయి. పొరుగున ఉన్న కర్ణాటకలో 65 శాతం ఫ్యామిలీలు ఇంటి ఖర్చుల భారం పెరిగిందని తెలిపాయి. జాతీయ స్థాయితో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఖర్చుల భారం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆగస్టు నెలలో పర్సనల్ కేర్, ఇంటికి అవసరమయ్యే వస్తువుల కోసం పెట్టిన ఖర్చు ఆగస్టు నెలలో 13 శాతం పెరిగిందని 44 శాతం కుటుంబాలు తెలిపాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజల నెలవారీ ఖర్చులు భారీగా పెరిగాయని యాక్సిస్ మై ఇండియా కన్జూమర్ సర్వేలో తేలింది. నిత్యావసరాల కోసం నెలవారీ ఖర్చులు పెరిగాయని తెలంగాణలోని 67 శాతం కుటుంబాలు చెప్పాయి. ఏపీలో 63 శాతం, తమిళనాడులో 61 శాతం కుటుంబాలు ఇదే మాట చెప్పాయి. ఒక్క నిత్యావసరాలే కాదు.. కుటుంబాలకు ఇతరత్రా ఖర్చులు సైతం ఆగస్టు నెలలో పెరిగాయి. ఏసీ, కారు, ఫ్రిజ్లు లాంటి వస్తువుల కోసం ఆగస్టు నెలలో 6 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది.
మీడియా అందించే కంటెంట్ వినియోగం కూడా పెరిగిందని ఈ సర్వేలో తేలింది. తాము ప్రతి రోజూ టీవీ షోలు చూస్తామని సర్వేలో పాల్గొన్నవారిలో 70 శాతం మంది తెలిపారు. వారంలో కనీసం ఒకసారైనా టీవీ షోలు చూస్తామని 87 శాతం మంది చెప్పారు. ఎంటర్టైన్మెంట్ విషయంలో టీవీనే ఇప్పటికీ ప్రధాన మాధ్యమంగా నిలిచింది. ఆగస్టు నెలలో వార్తలు చదవడం, చూడటం పెరిగిందని 20 శాతం కుటుంబాలు తెలిపాయి. ప్రతిరోజూ వార్తాపత్రికలు చదువుతామని సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది చెప్పడం గమనార్హం. ప్రింట్ మీడియా పట్ల జనాల్లో ఇప్పటికీ ఆదరణ తగ్గలేదనే విషయాన్ని ఇది వెల్లడిస్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ షార్ట్స్ లాంటి వాటిల్లో వీడియోలు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa