ఈసారి జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సదస్సును నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే వివిధ దేశాలకు చెందిన అధినేతలు ఢిల్లీకి చేరుకుని.. సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా తొలిసారి జీ 20 కూటమిని విస్తరించారు. అయితే ఇది భారత్ ఆతిథ్యం ఇస్తున్న వేళ జరగడం.. మన దేశానికి మరో గర్వకారణంగా నిలిచింది. వన్ ఎర్త్ సెషన్ ప్రారంభ ఉపన్యాసంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. ఆఫ్రికన్ యూనియన్ను జీ 20 కూటమిలోకి ఆహ్వానిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనకు జీ 20 దేశాల సభ్యులు అందరూ అంగీకరించడంతో.. ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ యూనియన్ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టి అధికారిక లాంఛనాలు పూర్తి చేశారు.
సబ్కా సాథ్ భావనతోనే ఆఫ్రికన్ యూనియన్కు జీ 20 కూటమిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సదస్సులో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అందరు సభ్యదేశాధినేతలు అంగీకారం తెలుపుతారని నమ్ముతున్నట్లు చెప్పారు. జీ 20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష హోదాలో భారత్ ఆఫ్రికన్ యూనియన్కు స్వాగతం పలుకుతున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ మేరకు ఆఫ్రికన్ యూనియన్ ఛైర్మన్ అజాలీ అసౌమనీని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్వయంగా తీసుకువచ్చి శాశ్వత సభ్యదేశాల కుర్చీలో కూర్చో పెట్టారు. 21వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దశ, దిశ సూచించడానికి ఇదే సరైన సమయమని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సవాళ్లకు ఇప్పుడు కొత్త పరిష్కారాలు కనుక్కోవాల్సిన అవసరం ఉందన్న మోదీ.. అందుకోసం మనం హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్తో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కొవిడ్ తర్వాత అంతర్జాతీయంగా విశ్వాస రాహిత్యం ఏర్పడిందని.. ఉక్రెయిన్ రష్యా యుద్ధం దాన్ని మరింత పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని విజయవంతంగా ఓడించిన మనం ఈ విశ్వాస రాహిత్యాన్ని కూడా ఓడించవచ్చని తెలిపారు. ఈ క్రమంలోనే సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మంత్రం మనకు మార్గదర్శిగా ఉంటుందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పేద, సంపన్న దేశాల మధ్య వ్యత్యాసాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, ఆరోగ్యం, ఎనర్జీ, నీటి భద్రత వంటి అంశాలకు సంబంధించిన సమాధానాల కోసం ముందుకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. జీ 20 అధ్యక్షత వహించిన భారత్.. దేశంలోనూ బయటా కలుపుకుని పోవడానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్న ప్రధాని.. అందుకే ఇది ప్రజల జీ 20 అని చెప్పారు. మరోవైపు.. సదస్సు ప్రారంభంలో తాజాగా మొరాకోలో సంభవించిన భూకంపానికి సంబంధించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా భూకంపంలో చనిపోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు మొరాకోకు అండగా నిలవాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa