జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం భారత్కు శుక్రవారం రాత్రి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురూ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో మోదీ, బైడెన్లు కీలక అంశాలపై చర్చించారు. భారత్ - అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా వీరి మధ్య చర్చలు జరిగినట్లుగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది. కృత్రిమ మేధ (ఏఐ), 5జీ, 6జీ స్పెక్ట్రమ్, ఉక్రెయిన్ రష్యా యుద్ధ సంక్షోభం, పౌర అణు రంగంలో పురోగతి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత అంశాలపై కూడా చర్చ జరిగింది. భేటీ తర్వాత ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి.
జూన్లో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలను అమలు చేయడంలో గణనీయమైన పురోగతిని ప్రధాని, బైడెన్ అభినందించారు. వచ్చే ఏడాది క్వాడ్ లీడర్స్ సమ్మిట్ 2024కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతుండగా.. కూటమి ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు ధ్రువీకరించారు. ఇండో-పసిఫిక్కు సహ-నాయకత్వం వహించాలనే అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్కు అమెరికా సంపూర్ణ మద్దతు ఉంటుందని అధ్యక్షుడు బైడెన్ పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా 2028లో భారత్ బాధ్యతలు చేపట్టనున్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు.
అమెరికా అధ్యక్షుడితో భేటీ అనంతరం ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది.. మా ఇరువురి సమావేశం చాలా అర్థవంతంగా జరిగింది.. భారత్, అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించాం.. మేం ప్రజల మధ్య సంబంధాలను ముందుకు తీసుకువెళ్తాం.. మన దేశాల మధ్య స్నేహం ప్రపంచ పురోగతిలో గొప్ప పాత్ర పోషిస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభాన్ని అధిగమించేందుకు కీవ్ ప్రతినిధులు తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో.. అధ్యక్ష హోదాలో భారత్ జీ20 సదస్సు ముఖ్యమైన ఫలితాలను ఎలా అందజేస్తుందో మరింతగా వివరించినందుకు బైడెన్ ప్రశంసించారు. ఇరువురు నేతలు G20 పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ శిఖరాగ్ర సదస్సు ఫలితాలు సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడం, బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, సమ్మిళిత ఆర్థిక విధానాల విషయంలో ప్రపంచ ఏకాభిప్రాయాన్ని పెంపొందించడం వంటి భాగస్వామ్య లక్ష్యాలను ముందుకు తీసుకువెళతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa