ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ఆశోక్ నగర్లోని ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. ఇప్పటికే.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు అరెస్ట్ కాగా.. జాతీయ కార్యదర్శి నారా లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తారన్న వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే.. ఇప్పుడు గల్లా జయదేవ్ ఇంటి దగ్గరికి సీఐడీ అధికారులు రావటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే.. సీఐడీ అధికారులు గల్లా జయదేవ్ ఇంటికి వచ్చింది.. ఆయన కోసం మాత్రం కాదు.. ఆయన ఇంట్లోనే ఉన్న నారా లోకేష్ కోసం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో ఏ 14గా ఉన్న లోకేష్కు సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు.. అక్కడి వెళ్లారు.
గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం పెట్టిన నారా లోకేష్.. ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారన్న సంగతి తెలియట్లేదు. కాగా.. నిన్న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు లోకేష్కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. కాగా.. లోకేష్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆయన ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న అధికారులు.. నేరుగా అక్కడికి వెళ్లారు. తాము వస్తున్న విషయాన్ని ముందుగానే.. ఎంపీకి తెలియజేశారు కూడా. కానీ.. ఈ విషయం అక్కడున్న సిబ్బందికి తెలియకపోవటంతో.. సీఐడీ అధికారులను కాసేపు గేటు బయటే నిలబెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత.. అక్కడున్న సిబ్బందితో మాట్లాడి.. తాము సీఐడీ అధికారులుగా పరిచయం చేసుకుని.. ఐడీ కార్డులు చూపించిన తర్వాతే.. వాళ్లను లోపలికి తీసుకెళ్లారు.
కాగా.. అప్పటికే గల్లా జయదేవ్ ఇంట్లో పలువురు టీడీపీ నేతలతో భేటీ అయిన నారా లోకేష్కు.. సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే.. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారులను లోకేష్ రిసీవ్ చేసుకున్నారు. కూర్చొండి అంటూనే.. "రాకరాక వచ్చారు.. కాఫీ, టీలు ఏమైనా తీసుకుంటారా" అంటూ ఆఫర్ చేశారు లోకేష్. కాగా.. అధికారులు మాత్రం నిరాకరించారు. ఏ కేసు కింద నోటీసులు ఇస్తున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. కాగా.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కింద అని అధికారులు చెప్పారు. అయితే.. వాట్సప్లో కూడా నోటీసులు పంపారు కదా.. మళ్లీ ఎందుకు వచ్చారంటూ అడిగారు లోకేష్. అయితే.. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసు విషయమై అక్టోబర్ 4న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. కాగా.. విచారణ నిమిత్తం లోకేష్ను విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు రావాలని పిలిచినట్టు అధికారులు తెలిపారు. కాగా.. అక్టోబర్ 4న లోకేష్ విచారణకు హాజరవుతారా.. లేదా లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అవుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa