కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత సాయం తీసుకుంటాం. మనం వెళ్లాల్సిన గమ్యాన్ని జీపీఎస్ తప్పుగా చూపిస్తే ఇబ్బందులు తప్పవు. ఆ పరిస్థితిలో కనిపించే వారినల్లా అడుగుతూ గమ్యం చేరుకుంటాం. మరి నేవిగేషన్ వ్యవస్థపై ఆధారపడి గాల్లో ఎగిరే విమానాలు తప్పుడు సంకేతాలు అంది దారి తప్పితే ఏం జరుగుతుందని ఎప్పుడైనా ఊహించారా? కానీ, అదే జరిగింది. జీపీఎస్ తప్పుడు సంకేతాలతో ఒకటి రెండు కాదు.. ఏకంగా 20 విమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు వారాల వ్యవధిలో 20 విమానాలు జీపీఎస్ తప్పుడు సంకేతాలతో గందరగోళానికి గురైన అంశంపై ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇరాన్ గగనతలం మీదుగా ఇటీవల ప్రయాణించిన 20 విమానాలు జీపీఎస్ స్పూఫింగ్కు గురయ్యాయని అధికారులు వెల్లడించారు. దీంతో తాము ఎక్కడ ఉన్నామో? ఎటు వెళుతున్నామనే విషయం తెలియక గందరగోళానికి గురయ్యామని సదరు విమానాల పైలట్లు తెలిపారు. తమ లొకేషన్ వివరాల గురించి ఇరాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులను అడిగి తెలుసుకున్నామని వివరించారు. అప్పుడు సమయం ఎంతవుతోందనే విషయంపైనా కాసేపు గందరగోళం నెలకొందని పేర్కొన్నారు.
విమాన ప్రయాణాల్లో నేవిగేషన్ వ్యవస్థ కీలకం.. టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు ప్రతీ క్షణం జీపీఎస్తో అనుసంధానమై పైలట్లకు మార్గం చూపుతుంది. ప్రయాణ మార్గంలో వివిధ దేశాల జీపీఎస్ వ్యవస్థలతో అనుసంధానం అవుతూ విమానానికి దారి చూపుతుంది. అయితే, ఇరాన్లో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని, ఫ్లైట్ నేవిగేషన్ వ్యవస్థ తప్పుడు సంకేతాలను చూపించిందని పైలట్లు తెలిపారు. సాధారణ ప్రయాణికుల విమానాలపై ఇలాంటి దాడి అత్యంత అరుదుగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
దాడికి గురైన విమానాల్లో బోయింగ్ 777, 737, 747 సహా పలు ప్రైవేటు విమానాలు కూడా ఉన్నాయి. అయితే, ఇరాన్ ఏటీసీ అధికారుల సూచనలతో ఈ విమానాలకు ముప్పు తప్పిందని సమాచారం. కేవలం 15 రోజుల వ్యవధిలో 20 విమానాలపై ఇలా దాడి జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోమారు ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇందులో శాన్ఫ్రాన్సిస్కో, ఇస్తాంబుల్, బాకు, లండన్ వంటి నగరాలకు వెళ్లే భారతీయ విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఇండిగో, విస్తారా విమానాలు ఇరాన్ గగనతలం మీదుగా వెళ్తుంటాయి. దీని గురించి డీజీసీఏ, సదరు ఎయిర్లైన్స్ స్పందించడానికి నిరాకరించాయి. యూఎస్ రేడియో టెక్నికల్ కమిషన్ ఫర్ ఆస్ట్రోనాట్స్ ప్రకారం.. ‘శాటిలైట్ సిగ్నల్ని రహస్యంగా మార్చడం, మానిప్యులేటెడ్ చేయడం వల్ల శాటిలైట్ సిగ్నల్తో జీపీఎస్ రిసీవర్ ఒక తప్పుడు ప్రదేశం, సమయాన్ని చూపడాన్ని’ స్ఫూపింగ్ అంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa