ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చి తమిళనాడులో అన్నాడీఎంకే ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకుముందే బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగలింది. తాజాగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. మీడియా సమావేశం సందర్భంగా అన్నామలైని ఒక మహిళా రిపోర్టర్ ప్రశ్న అడగ్గా.. ఆయన సమాధానం చెప్పిన తీరు ఇప్పుడు ఈ వివాదానికి కారణమైంది. మహిళా జర్నలిస్ట్ పట్ల తమిళనాడు బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై కోయంబత్తూర్ ప్రెస్ క్లబ్ తీవ్రంగా మండిపడింది. ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అన్నామలై ప్రవర్తనపై తమిళనాడులోని ప్రతిపక్ష నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు కాకపోయి ఉంటే.. కాషాయ పార్టీలోనే కొనసాగేవారా అని ఓ మహిళా జర్నలిస్ట్ అన్నామలైకి ప్రశ్న వేశారు. అయితే ఈ ప్రశ్నకు విసుగెత్తిపోయిన అన్నామలై తీవ్రంగా స్పందించారు. ఆ ప్రశ్న అడిగిన వారు ఎవరో ముందుకు వచ్చి తన పక్కనే నిలబడాలని కోరారు. ఆ జర్నలిస్ట్ వచ్చి నిలబడితే వారిని అక్కడ ఉన్న అందరూ చూస్తారంటూ పేర్కొన్నారు. అంతటి అద్భుతమైన ప్రశ్నను అడిగిన వారు ఎవరు అనేది తమిళనాడులోని 8 కోట్ల మంది ప్రజలు కూడా తెలుసుకోవాలి కదా అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
జర్నలిస్ట్లు కూడా ప్రశ్నలు అడగడానికి ఒక పద్దతి ఉంటుందని అన్నామలై హితవు పలికారు. ఆ తర్వాత ఆ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన అన్నామలై.. తాను పూర్తిగా రాజకీయ నాయకుడిని కాదని.. గతంలో రైతును అని తెలిపారు. ఆ తర్వాతే రాజకీయ నాయకుడిగా మారినట్లు చెప్పారు. ఆ తర్వాతే బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సరైన విధంగా ప్రశ్నలు అడగాలని ఆ మహిళ జర్నలిస్ట్కు సూచించారు.
అయితే ఒక మహిళా జర్నలిస్ట్పై అన్నామలై ప్రవర్తించిన తీరుపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. అసలు రిపోర్టర్లకు జర్నలిజం విలువలను చెప్పేముందు నాయకుడికి ఉండాల్సిన లక్షణాలను అన్నామలై నేర్చుకోవాలని కోయంబత్తూర్ ప్రెస్ క్లబ్ ఘాటుగా స్పందించింది. మరోవైపు.. అన్నామలైపై ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా మండిపడ్డాయి. ఇలాంటి అహంకారాన్ని ఏ రాజకీయ నాయుకుడిలోనూ చూడలేదని.. తమిళనాడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లక్ష్మీ రామచంద్రన్ విమర్శించారు. మానవాళికి అన్నామలైను దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తున్నారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవలే తమిళనాడులోని అన్నాడీఎంకే బీజేపీతో తెగదెంపులు చేసుకొని.. ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చింది. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ తలెత్తడానికి ముఖ్య కారణం అన్నామలై అని అన్నాడీఎంకే నేతలు తీవ్ర ఆరోపణలు చేసింది. పెరియర్ రామస్వామి, అన్నదొరై, జయలలితలపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై పలుమార్లు తీవ్ర విమర్శలు చేసినట్లు అన్నాడీఎంకే ఆరోపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa