ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా ముందు ఇంద్రకీలాద్రిపై ఆధిపత్య పోరు,,,,వారంలో రెండోసారి ఈవో నియామకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 06:21 PM

విజయవాడలోని కనక దుర్గమ్మ ఆలయ ఈవోగా కేఎస్ రామారావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాళహస్తి ఆర్డీవోగా పని చేస్తున్న రామారావును విజయవాడలోని కనక దుర్గ ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బదిలీ చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఆయన బదిలీ తక్షణమే అమల్లోకి వస్తుందని.. వెంటనే ఆయన దుర్గ గుడి ఈవోగా బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 15 నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు జరగనున్న నేపథ్యంలో కొత్త ఈవో బాధ్యతలు చేపట్టనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఇంతకు ముందు దుర్గమ్మ ఆలయ ఈవోగా భ్రమరాంబ పని చేశారు. వరుసగా రెండేళ్లపాటు ఆమె కనక దుర్గ ఆలయ ఈవో హోదాలో దసరా నవరాత్రుల వేడుకలను ఆమె నిర్వహించారు. ఈసారి కూడా ఏర్పాట్లు చేయిస్తు్న్న భ్రమరాంబను.. నవరాత్రులు మరో 15 రోజుల్లో ఉన్నాయనగా అకస్మాత్తుగా బదిలీ చేసి.. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ను ఆలయ ఈవోగా నియమిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు శ్రీనివాస్ బదులు కేఎస్ రామారావును ఈవోగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.


రాష్ట్రంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటైన కనక దుర్గ ఆలయం విషయంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే ప్రచారం జరుగుతోంది. భ్రమరాంబకు మంత్రి మద్దతుగా ఉన్నారని.. దీంతో ఆమెను బదిలీ చేసి వెల్లంపల్లి పంతం నెగ్గించుకున్నారని ప్రచారం జరిగింది. గత ఏడాది ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను కొట్టు సత్యనారాయణ దగ్గరుండి పర్యవేక్షించారు.


ఆలయ ఈవోగా భ్రమరాంబ ఉన్న సమయంలో.. ఎమ్మెల్యే వెల్లంపల్లి, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబుతో ఆమెకు పొసగలేదు. దీంతో ఆమె బదిలీ కోసం వారు తీవ్రంగా ప్రయత్నించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఆలయ ఈవోను మార్చాలంటూ.. దుర్గ గుడి ఆలయ చైర్మన్ రాంబాబు ఏకంగా సీఎం జగన్‌కు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం వ్యవధిలోనే రెండుసార్లు ఈవోను మార్చడంతో.. ఈసారి ఏ వర్గం పై చేయి సాధించిందనే చర్చ నడుస్తోంది.


2021 ఏప్రిల్‌లో భ్రమరాంబ దుర్గ గుడి ఈవోగా బాధ్యతలు చేపట్టగా.. అంతకు ముందు సురేశ్ బాబు ఆ బాధ్యతల్లో ఉన్నారు. ఆయన ఈవోగా ఉన్న సమయంలో ఏసీబీ అధికారులు ఆలయంలో సోదాలు చేసి.. దేవస్థానంలో అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా 15 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. తర్వాత కొంత కాలానికి సురేశ్ బాబును బదిలీ చేసి భ్రమరాంబను ఈవోగా నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం.. కర్నాటి రాంబాబు చైర్మన్‌గా.. 15 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa