మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఆర్కే రోజా మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఒక మనిషి చనిపోతే కొన్ని రోజులే బాధపడతారని... కానీ తాను ఈ నిందలను జీవితాంతం భరించాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళగా తాను సినీ రంగంలోకి ప్రవేశించి ఎలా ఎదిగానో అందరికీ తెలుసునని రోజా అన్నారు. ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా అటు సినీనటిగా పేరు తెచ్చుకున్నానని.. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు టికెట్ ఇచ్చి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేశారని అన్నారు. ఇంత కష్టపడి పైకి వచ్చిన తనపై ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడటంపై దారుణమని మండిపడ్డారు. ఒక మంత్రిగా ఉన్న తనపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసే దుర్మార్గులు బయట తిరగకూడదని.. బండారు సత్యనారాయణమూర్తికి తానేంటో చూపిస్తానని రోజా సవాల్ చేశారు. ఇకపై ఎవరైనా మహిళల పట్ల చులకనగా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తానన్నారు. బండారు సత్యనారాయణలాంటి చీడపురుగులను ఏరివేసేలా చట్టాలు తీసుకువచ్చేందుకు పోరాడుతానని స్పష్టం చేశారు. అతడిపై పరువు నష్టం దావా వేసి కోర్టుకీడుస్తానని.. సుప్రీంకోర్టు వరకైనా న్యాయ పోరాటం చేస్తానని రోజా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa