ప్రకాశం జిల్లాలో మానేపల్లి సాగర్ కాలువలో పడి మృతిచెందిన మహిళ డెత్ మిస్టరీ వీడింది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని రామాపురానికి చెందిన పూజల శ్రీనుకు, పుల్లలచెరువు మండలం సిద్ధన్నపాలేనికి చెందిన కోటేశ్వరికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. శనివారం పిల్లల్ని ఇంట్లో ఉంచి శ్రీను, కోటేశ్వరి పని మీద వెళుతున్నామని చెప్పి పుల్లలచెరువు మండలంలోని మానేపల్లి వెళ్లారు. భర్త శ్రీను మాయమాటలు చెప్పి భార్య కోటేశ్వరిని సమీపంలోని సాగర్ కాలువ దగ్గరకు తీసుకెళ్లి అందులోకి నెట్టేశాడు. ఆపై తన బైక్ను కూడా కాలువలోకి పడేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వచ్చేశాడు. బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో భార్య చనిపోయిందని.. తాను ప్రాణాలతో బయటపడ్డానని బంధువులకు చెప్పాడు. సాగర్ కాలువలో గల్లంతైన మహిళ మృతదేహాన్ని త్రిపురాంతకం మండలంలోని విశ్వనాథపురం సమీపంలో ఆదివారం గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పుల్లలచెరువు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల సహాయంతో మహిళ మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు పోలీసులు. భర్తే మాయమాటలు చెప్పి భార్యను కాలువలోకి నెట్టి, ఆపై బైక్ను కూడా అందులో పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు నిర్థారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa