కన్నబిడ్డలా సాగు చేసిన పంట కళ్ల ముందే నీళ్లు లేక ఎండిపోతుంటే ఆ రైతు తట్టుకోలేకపోయాడు. పొలం మొత్తం పగుళ్లతో కనిపిస్తుంటే తల్లడిల్లిపోయాడు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో కనిపించిన ఈ దృశ్యాన్ని చూసి అందరి కళ్లు చెమర్చాయి. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి ఎండిన పొలాలను పరిశీలించేందుకు వెళ్లారు. ఆ సమయంలో నెర్రెలిచ్చిన వరి పొలాలను చూసి గోవిందరాజు అనే రైతు తన ఆవేదనను వ్యక్తం చేశారు. బీడువారిన పొలాన్ని చూసి ఒక్కసారిగా బోరున ఏడ్చేశాడు. ఇలా ఉంది పంట పరిస్థితి అంటూ తన కష్టాన్ని చెప్పుకున్నాడు.
బాధిత రైతు గోవిందరాజును బుద్ధప్రసాద్ ఓదార్చారు.. ధైర్యంగా ఉండాలన్నారు. వరిసాగు కోసం ఇప్పటికే ఎకరాకు రూ.25వేలు పెట్టుబడులు పెట్టామని.. నీరందకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. దివిసీమలో సాగునీటి సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు బుధ్ద ప్రసాద్. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కనీసం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని..అధికారులూ కాలువలు, పంట పొలాలను పరిశీలించడం లేదన్నారు. గతంలో ఇలాంటి ఇబ్బందులు వస్తే ప్రత్యేక అధికారులు రంగంలోకి దిగి నీటి సరఫరా చేసేవాళ్లన్నారు. ప్రాజెక్టుల్లో నీరు లేకపోతే ప్రభుత్వం పట్టిసీమ నుంచి ఇచ్చేదని.. దివిసీమలో సాగునీటి సమస్యను పరిష్కరించకపోతే రెండు రోజుల్లో సొర్లగొంది ఆయకట్టు నుంచే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
నాగాయలంక మండలంలో సాగునీరందక వరి పొలాలు బీటలు వారుతుంటే సాగునీరు కొరత లేదని నేతలు ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా సాగునీరు అందించాలని.. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నీరు లేని వరి పొలంలో నిరసన దీక్ష చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబుకు అత్యంత సన్నిహితుడు అయినా.. స్థానిక పరిస్థితులను ఆయనకు వివరించి సాగునీటి విడుదల చేయించ లేని దౌర్భాగ్య స్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని విమర్శించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కేఈబీ కెనాల్కు 2వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa