బ్రెయిన్డెడ్ (జీవన్మృతి) అయిన ఐదు రోజుల నవజాత శిశువు అవయవాలతో ముగ్గురు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఓ మహిళ మగబిడ్డను ప్రసవించగా.. శిశువులో కదలికలేవీ లేకపోవడంతో వైద్యులు బ్రెయిన్డెడ్గా నిర్ధరించారు. ఈ విషయం తెలిసిన ఓ స్వచ్ఛంద సంస్థ, వైద్యులు ఆ బిడ్డ తల్లిదండ్రులు సంప్రదించి వారిని అవయవదానానికి ఒప్పించారు. దీంతో కిడ్నీలు, కాలేయం, కార్నియా, ప్లీహాన్ని సేకరించి.. ముగ్గురు చిన్నారులకు వాటిని అమర్చారు. ఈ ఘటన గుజరాత్లో సూరత్ పట్టణంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అక్టోబరు 13న సూరత్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అమ్రేలికి చెందిన ఓ మహిళ మగబిడ్డను ప్రసవించింది. అయితే, ఆ శిశువులో ఎటువంటి కదలికలు లేకపోవడంతో వైద్యులు జీవన్మృతిగా నిర్ధరించారు. ఈ విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ జీవన్దీప్ ఆర్గాన్ డొనేషన్ ఫౌండేషన్ (జేఓడీఎఫ్) మేనేజింగ్ ట్రస్టీ విపుల్ తలావియా, ప్రభుత్వ న్యూ సివిల్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ నీలేష్ కచ్చడియాలు.. శిశువు తల్లిదండ్రులను కలిసి.. అవయవదానం ప్రాధాన్యతను వారికి వివరించారు. దీంతో ఆ చిన్నారి అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు సమ్మతించారు.
వారి అనుమతితో పీపీ సవానీ ఆసుపత్రి వైద్యులు బుధవారం శిశువు రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిన్నారులకు అమర్చారు. దేశంలో అత్యంత పిన్న వయసు అవయవదాతగా ఈ పసికందును చెబుతున్నారు.జీవన్దాన్ ట్రస్టీ విపుల్ తలావియా మాట్లాడుతూ.. అక్టోబరు 13న ప్రయివేట్ ఆస్పత్రిలో పుట్టిన శిశువులో ఎటువంటి కదలికలు లేకపోవడంతో మరో ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్పై ఉంచారు.. ఆ శిశువుకు వైద్యం చేసిన డాక్టర్లు.. కోలుకునే అవకాశం లేదని, బ్రెయిన్డెడ్గా ప్రకటించారు’ అని అన్నారు.
ఈ విషయం గురించి తెలియడంతో ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి వైద్యుడు నీలేష్ కచ్చడియాతో కలిసి ఆ శిశువు తల్లిదండ్రులు హర్ష్ సంఘానీ, చేతనలను కలిసి అవయవదానం గురించి వివరించామని చెప్పారు. భార్యాభర్తలు తమ బిడ్డ అవయవాలను దానం చేయడానికి సమ్మతించారని తలావీయా పేర్కొన్నారు. ఆ శిశువు నాయినమ్మ రష్మీబెన్.. అవయవదానానికి వెళ్లేలా ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. సంఘాని కుటుంబానికి చెందిన వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం అవయవ దానం ద్వారా గుండె మార్పిడి చేయించుకున్నాడని, ఆ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని రష్మీబెన్ కుటుంబ సభ్యులకు వివరించారు.
నవజాత శిశువు నుంచి రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. కార్నియాను సూరత్ ఐ బ్యాంకుకు..మూత్రపిండాలను అహ్మదాబాద్లోని కిడ్నీ రిసెర్చ్ సెంటర్కు, కాలేయాన్ని ఢిల్లీలోని లివర్ బైలరీ సైన్సెస్ ల్యాబొరేటరీకి తరలించారు. అనంతరం తొమ్మిది నెలల చిన్నారికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. కిడ్నీలను 13 ఏళ్లు, 15 ఏళ్ల చిన్నారులు ఇద్దరికి అమర్చి.. కొత్త జీవితాన్ని ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa