మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో నాలుగు వారాల పాటూ బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు. అయితే బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పులో ఐదు షరతులు ఉన్నాయి. చంద్రబాబు రూ.1 లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆయన సొంత ఖర్చులతో ఏ ఆస్పత్రిలోనైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చని తెలిపారు. అలాగే చంద్రబాబు వైద్యానికి సంబంధించిన వివరాలను.. సీల్డ్ కవర్లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్, ట్రయల్ (ఏసీబీ) కోర్టుకు ఇవ్వాలన్నారు.
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కేసును ప్రభావితం చేయొద్దని.. నవంబర్ 28న సా.5 గంటలకు సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి.. ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. జైలు అధికారులకు కోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తరువాత ప్రొసీడింగ్స్ మేరకు చంద్రబాబు విడుదల చేస్తారు. చంద్రబాబు ఎన్ ఎస్ జి సెక్యూరిటీ పరిధిలో ఉండడంతో జిల్లా ఎస్పీకి జైలు అధికారులు సమాచారం ఇస్తున్నారు.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఎయిర్ పోర్టుకు చంద్రబాబు వెళతారు. అక్కడి నుంచి విజయవాడ వస్తారని చెబుతున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ట్రీట్మెంట్ తీసుకుంటారని చెబుతున్నారు. ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది.. రాజమహేంద్రవరం నుంచి తిరుపతి వెళతారని.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ ఆస్పత్రిలో చేరతారని కూడా చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి రాజమహేంద్రవరం చేరుకున్నారు.
మరోవైపు సీఐడీ తాజాగా నమోదు చేసిన మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ను హైకోర్టు అనుమతించింది.. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరగనుంది. అయితే మెడికల్ గ్రౌండ్లో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్పై విడుదల అవుతున్నందున మరో కేసులో అరెస్ట్ చేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa