ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. గత చరిత్రను గుర్తు చేసుకుంటూ వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2023, 08:46 PM

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవంబరు 1ని అవతరణ దినోత్సవంగా నిర్వహించేవారు. 2014 జూన్ 2 న రాష్ట్రం విడిపోవడంతో తెలంగాణలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై గతంలో కొంత గందరగోళ పరిస్ధితి కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరపాలో గత ప్రభుత్వ హయాంలో క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ ఒరిజనల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని కేంద్రం చె్పింది. దీంతో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


గతంలో ఉమ్మడి మద్రాస్‌లో అన్యాయం జరుగుతుందనే భావనతో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిమాండ్ తెరపైకి వచ్చింది. మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న సమయంలో ఆంధ్ర ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఉద్యమించారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో 40 శాతం జనాభా, 58 శాతం విస్తీర్ణం తెలుగువారిదేనని పోరాటం మొదలు పెట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 1911 చివరి నాటి నుండి ఊపందుకుంది. ఆ తర్వాత ఏడాది నిడదవోలులో జరిగిన సమావేశంలో ప్రత్యేక రాష్ట్ర సాధన విషయమై చర్చించారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై చర్చ జరిగింది. అయితే రాయలసీమ, విశాఖకు చెందిన ప్రతినిధులు ఈ ప్రతిపాదనకు సుముఖత చూపలేదు. ఆ ప్రాంతాల్లో కూడా బోగరాజు పట్టాభి సీతారామయ్య పర్యటించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు. కాకినాడలో జరిగిన ఆంధ్రమహాసభలో పట్టాబి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్యతో కలిసి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై కరపత్రాలను పంపిణీ చేశారు.


రెండో ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడలో జరిగింది. ఆ సభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేశారు. ఆ తర్వాత ఉద్యమం అలా కొనసాగింది. 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు నిరహార దీక్షను ప్రారంభించారు. 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు కన్నుమూయడంతో ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రధాని నెహ్రూ ప్రకటించారు. 1953 నవంబర్ 1న తెలుగు మాట్లాడే 11 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ 11 జిల్లాలు ఆనాడు మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. ఆ సమయంలో భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ కూడా ఉంది. దీంతో 1956, నవంబరు 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, మద్రాస్ నుంచి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.


హైద్రాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం కావడాన్ని అప్పట్లో కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజలు మాట్లాడే బాష ఆధారంగా ఏర్పడిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రకెక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు జరిగాయి. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఉద్యమం మరింత ఊపందుకుంది.. 2009 ఎన్నికల తర్వాత పరిణామాలు మారిపోయాయి. కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది.


ఈ హామీలో భాగంగానే 2014లో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును యూపీఏ ప్రవేశ పెట్టగా.. ఈ బిల్లుకు బీజేపీ కూడా మద్దతు తెలిపింది. 2014 జూన్ 2న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి.. ఏపీ పునర్విభజన చట్టం కూడ రూపొందించారు. 2014 ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతల్ని చేపట్టారు. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో జూన్ 2న చంద్రబాబు సర్కార్ నవ నిర్మాణ దీక్షలను చేపట్టింది. ఆ తర్వాత జగన్ సర్కార్ నవంబర్ 1న అవతరణ దినోత్సవాలు నిర్వహిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa