తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబరు 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు.. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ.300/- దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నవంబరు 10వ తేదీ ఆన్లైన్లో ఈ టికెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. తిరుపతిలోని 9 కేంద్రాలలో 100 కౌంటర్లలో.. డిసెంబరు 22వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకు టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు 4.25 లక్షలు విడుదల చేస్తామన్నారు. డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలైన చంటిపిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్ఆర్ఐల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 2000 టికెట్లు చొప్పున ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300/- దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుంచి మాత్రమే) ఉంటుందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు. అలాగే తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో సూచించారుజ. అక్టోబరు 24 నుంచి 27వ తేదీ మధ్యలో .. శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో.. రెండు చిరుతలు, ఒక ఎలుగుబంటి తిరుగుతున్నట్టుగా కెమెరా ట్రాప్లో నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. కావున నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగానే వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
అంతేకాదు 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా, ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్ టాప్ క్యాలెండర్లను భక్తులు కొనుగోలు చేయొచ్చన్నారు. తిరుమల, తిరుపతి, ఆన్లైన్తో పాటుగా.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్లోని శ్రీవారి ఆలయాలు, ముంబై, ఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు.. నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉన్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa