హర్యానాలో కల్తీ మద్యం పడగ విప్పింది. ఈ కల్తీ మద్యం తాగి 19 మంది మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా గుర్తించి ఏడుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ నిందితులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కావడంతో రాజకీయంగా తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. కల్తీ మద్యంతో అంత మంది చనిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ నిషేధిత ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న 200 మద్యం డబ్బాలను సీజ్ చేశారు. ఆ కల్తీ మద్యం తయారు చేయడానికి వాడిన పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఈ కల్తీ మద్యం అంబాలా జిల్లాలోని పలు వైన్ షాపులకు సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఆ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి తాగిన 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మందేబరి, పంజెతో కా మజ్రా, పూస్ఘర్, సరన్ గ్రామాలకు చెందిన 19 మంది చనిపోయారు. ఈ క్రమంలోనే వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలించగా చికిత్స పొందుతూ మరణించారని వైద్యులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ప్రధాన పాత్రదారులుగా గుర్తించి ఏడుగురిని అరెస్ట్ చేశారు. అందులో ఒక కాంగ్రెస్ నేతతోపాటు జననాయక్ జనతా పార్టీ-జేజేపీ నేత కుమారుడితోపాటు మరో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.
ఈ ఘటనపై అధికారంలో ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కల్తీ మద్యాన్ని అరికట్టడంలో హర్యానా సర్కార్ పూర్తి స్థాయిలో విఫలం అయిందని మండిపడ్డాయి. ఈ క్రమంలోనే లిక్కర్ సరఫరా చేసిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఇద్దరు కార్మికులు అంబాలా జిల్లాలో గురువారం కల్తీ మద్యం తాగి మరణించారు.
ఇక ఈ కల్తీ మద్యం పట్ల చనిపోయిన వారి కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రాత్రి మద్యం తాగి తన తండ్రి చనిపోయాడని.. ఓ వ్యక్తి కన్నీరు మున్నీరయ్యాడు. అయితే తన తండ్రి తక్కువ మోతాదులోనే మద్యం సేవిస్తాడని.. కల్తీ మద్యం తాగడం వల్లే తన నాన్న ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే గ్రామస్తులు మాత్రం మద్యం వ్యాపారులపై బహిరంగంగా మాట్లాడేందుకు భయపడటం వారి ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది. తాము నోరు విప్పితే తమ ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని ఒక గ్రామస్థుడు చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ కల్తీ మద్యం తాగి 19 మంది చనిపోయిన ఘటనను తీవ్రంగా పరిగణించిన హర్యానా ప్రభుత్వం.. కేసు విచారణ నిమిత్తం యమునానగర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa