సమాజంలో జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు మానవ జాతికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. కొందరు కన్నూ మిన్నూ కానకుండా జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఓ ఎస్సై అమానవీయంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్లో శుక్రవారం జరిగింది. దౌసా జిల్లాలోని రహువాస్ పోలీస్ స్టేషన్లో భూపేంద్ర సింగ్ అనే వ్యక్తి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే డ్యూటీలో యూనిఫాంలో ఉన్న భూపేంద్ర సింగ్.. మరో పోలీస్ ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడే ఓ నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటోంది. ఆ ఎస్సైని చూసి దగ్గరికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆ బాలికను చూసిన ఎస్సై భూపేంద్ర సింగ్కు కామ కోరిక కలిగింది. వెంటనే ఆమెకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి.. తన రూమ్కు తీసుకెళ్లాడు. అనంతరం ఆ చిన్నారిపై లైంగిక దాడి చేశాడు.
ఈ ఘటన జరిగిన తర్వాత ఆ విషయాన్ని ఆ చిన్నారి.. తన తల్లికి చెప్పింది. దీంతో చిన్నారి తల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎస్సై భూపేంద్ర సింగ్ను అరెస్టు చేశారు. అనంతరం ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. చిన్నారికి న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర నిరసనకు దిగారు. మరోవైపు.. 4 ఏళ్ల చిన్నారిపై ఎస్సై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై స్థానిక బీజేపీ స్పందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న రాజ్యసభ ఎంపీ కిరోడి లాల్ మీనా.. రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చిన్నారిపై పోలీస్ అత్యాచారం చేసిన ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడేందుకు తాను అక్కడికి వెళ్లానని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న అశోక్ గెహ్లోత్ సర్కార్.. అసమర్థత కారణంగానే పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. బాధిత కుంటుబానికి పరిహారాన్ని అందిస్తామని ఎంపీ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa