ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హమాస్ ఉగ్రవాదులను అంతం చేయాలని ఎలాన్ మస్క్ పిలుపు

international |  Suryaa Desk  | Published : Sat, Nov 11, 2023, 10:05 PM

ఇజ్రాయెల్‌పై దాడి చేసి హమాస్ ఉగ్రవాదులు తమ అంతాన్ని తామే కొని తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే తమపై చేసిన దాడికి ఇజ్రాయెల్ దీటుగా ప్రతీకార దాడులకు దిగుతోంది. దీంతో గాజా ప్రాంతంలో రక్తపాతం కనిపిస్తోంది. ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. ప్రస్తుతం గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించిన ఇజ్రాయెల్ బలగాలు.. హమాస్ ఉగ్రవాదులను ఏరిపారేయాలని.. అసలు ఆ సంస్థనే నామరూపాల్లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు వారిని అంతం చేయకపోతే.. హమాస్ ఉగ్రవాదులు మళ్లీ మళ్లీ ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతారని హెచ్చరికలు జారీ చేశారు.


మరోవైపు.. హమాస్‌ నెట్‌వర్క్‌ను అంతం చేసేదాకా వదలమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలోనే గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ భీకర దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ బలగాలు పూర్తిగా హతమార్చడం లేదా ఖైదీలుగా చేయాలని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. అమెరికన్‌ పాడ్‌కాస్ట్‌ షో అయిన లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌‌లో మాట్లాడిన మస్క్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. హమాస్‌ ఉగ్రవాదులను చంపకుంటే వాళ్లు మళ్లీ తిరిగి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధంపై తలెత్తున్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై ఆకస్మికంగా దాడులు చేసిన హమాస్‌ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌ విజయం సాధిస్తుందని కనీసం ఊహించలేకపోయిందని ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడగట్టుకునేందుకే ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు తీవ్రమైన దారుణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే తాము చేసిన దాడులకు ఇజ్రాయెల్ ఈ స్థాయిలో విరుచుకుపడుతుందని హమాస్ ఉగ్రవాదులు ఊహించలేకపోవచ్చని ఎలాన్ మస్క్‌ తెలిపారు.


ఈ సందర్భంగానే యుద్ధంలో ఇజ్రాయెల్‌ కొంత జాలి, దయతో వ్యవహరించాలని ఎలాన్ మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గాజాలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు మానవతా సాయం కింద మొబైల్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ఎలాన్ మస్క్ సూచించారు. మరోవైపు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు మానవతా కారిడార్లకు ఇజ్రాయెల్ అనుమతించింది. బందీల విడుదలకు ఉత్తర గాజాలో జరుపుతున్న యుద్ధానికి రోజుకు 4 గంటలు విరామం ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే కాల్పుల విరమణకు మాత్రం అంగీకరించడం లేదు. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa