ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో దళిత రైతులకు సీఎం జగన్ తీపి కబురు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 06:36 PM

దశాబ్ధాలుగా అనుభవదారులుగా రైతులకు హక్కులు కల్పిస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏలూరు జిల్లా నూజివీడులో భారీ భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిని శాశ్వత హక్కుతో అందించారు. 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు 33.32 ఎకరాలను ఇదే వేదిక నుంచి మంజూరు చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు.


స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా భూ సర్వే చేస్తున్నామన్నారు. రెండు విడతల సర్వే పూర్తైందని, మూడో విడత ప్రారంభించబోతున్నామన్నారు. సీఎంవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 27లక్షల 42 వేల ఎకరాలకు సంబంధించి16 లక్షల 21వేల మందికి హక్కులు కల్పించ బోతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూములను అత్తగారి సొత్తులా భావించి స్వాధీనం చేసుకునేవారన్నారు. చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చంద్రబాబు చేర్చారని జగన్ పేర్కొన్నారు.


ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములపై దళిత రైతుల రుణాలు మాఫీ చేస్తూ, సర్వ హక్కులు కల్పించబోతున్నామన్నారు. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మూడు కేటగిరీలుగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని జగన్ వెల్లడించారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూ­ములు, సర్వీస్‌ ఈనాం భూములను 22 ఏ జా­బితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూము­లపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీని సీఎం జగన్‌ ఈ సభలో ప్రారంభించారు.


రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నామన్నారు సీఎం జగన్. చుక్కుల భూములకు సైతం పరిష్కారం చూపించామని, అసైన్డ్‌ భూములు, లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్‌డేట్‌ చేస్తున్నామన్నారు. వేలమంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామన్నారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చ. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించామన్నారు. లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించామన్నారు. గ్రామ ఇనామ్‌ సర్వీస్‌ భూములనునిషేధిత జాబితా నుంచి తొలగించామన్నారు.


చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారన్నారు సీఎం. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్‌ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారన్నారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్‌.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు అన్నారని.. ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్‌మెంట్‌ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని.. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్‌ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దన్నారు. . 2014 చంద్రబాబు, పవన్‌ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోను అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa