ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ్ఞానవాపీ మసీదు సర్వే నివేదిక.. మరోసారి గడువుకోరిన ఏఎస్ఐ

national |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 10:52 PM

వారణాసి కోర్టు ఆదేశాలతో జ్ఞానవాపీ మసీదులో శాస్త్రీయ సర్వేను పూర్తిచేసిన భారత పురావస్తు శాఖ.. నివేదికను సమర్పించడానికి మరింత గడువు కోరింది. ఇప్పటికే 100 రోజులు గడువు ఇవ్వగా.. మరో రెండు వారాలు సమయం కోరడంతో న్యాయస్థానం శనివారం విచారణ జరపనుంది. వాస్తవానికి నివేదికను నవంబరు 2న సమర్పించాల్సి ఉండగా.. ఏఎస్ఐ గడువు కోరడంతో పది రోజుల పాటు పొడిగించింది. గత సోమవారంతో ఆ గడువు ముగియగా.. మరోసారి దానిని పెంచాలని కోరింది. సర్వేలో గుర్తించిన అంశాలను నివేదికగా క్రోడీకరించడానికి సమయం పడుతుందని పేర్కొంది.


కాశీ విశ్వనాధుని ఆలయం సమీపానికి ఉన్న 17 వ శతాబ్దం నాటి జ్ఞానవాపీ మసీదును హిందూ ఆలయాన్ని పడగొట్టి నిర్మించారని హిందువులు వాదిస్తున్నారు. ఈ మసీదు ప్రాంగణంలోని ఉన్న హిందూ దేవతల విగ్రహాలే అందుకు ఆధారమని అంటున్నారు. జ్ఞానవాపీ మసీదు లోపల ఉన్న శృంగార గౌరి, కుబేర్‌నాథ్ తదితర దేవతా విగ్రహాలకు నిత్యం పూజలు చేసేలా అనుమతించాలని కోరుతూ రెండేళ్ల కిందట ఐదుగురు హిందూ మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం మలుపు తిరిగింది. వారు శాస్త్రీయ సర్వే కూడా చేపట్టాలని కోరారు.


సర్వేకు కోర్టు అనుమతించడంతో.. మసీదు మేనేజ్‌మెంట్ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. కింద కోర్టు ఆదేశాలను సమర్థించిన హైకోర్టు.. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఇది అవసరం అని తీర్పు ఇచ్చింది. ఇది ఇరువర్గాలకు మేలు చేస్తుందని కోర్టు పేర్కొంది. దీనికి ముందు బేస్‌మెంట్‌తో పాటు కాంప్లెక్స్‌లోని ఇతర ప్రదేశాలను అనుమతి లేకుండా ఏఎస్ఐ తవ్వుతుందని, నిర్మాణం పశ్చిమ గోడ సమీపంలో శిథిలాలు పేరుకుపోతున్నాయని, ఇది కూలిపోయే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ మసీదు యాజమాన్యం సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేసింది. శిథిలాలు లేదా చెత్తను తొలగించి ప్రాంగణాన్ని సర్వే చేయడానికి ఏఎస్ఐకి అధికారం లేదని ప్యానెల్ తెలిపింది.


అలహాబాద్ హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సర్వేపై స్టే ఇచ్చేందుకు ఆగస్టు 4న సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. సర్వే సమయంలో దురాక్రమణ చర్యలకు పాల్పడకూడదని ఏఎస్ఐ‌కు సూచించింది. దీంతో వారణాసి కోర్టు తవ్వకాలను నిర్వహించవచ్చని పేర్కొంది. మరోవైపు, సర్వేకు సంబంధించిన వార్తల విషయంలో మీడియాకు వారణాసి జిల్లా కోర్టు ఆగస్టులో హెచ్చరికలు చేసింది. భారత పురావస్తు శాఖ, వాదులు, ప్రతివాదుల నుంచి సరైన సమాచారం లేకుండా కథనాలు ప్రచురించవద్దని సూచించింది. లేకుంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే, సర్వే పూర్తయిన తర్వాత నివేదికను న్యాయస్థానానికే అందజేయాలని, మీడియాకు ఎటువంటి లీకులు ఇవ్వొదని ఏఎస్ఐ అధికారులను ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa