టెక్నాలజీ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. మంచి ఉద్దేశం కోసం రూపొందించిన టెక్నాలజీ పక్కదారి పట్టి.. అదే పెద్ద సమస్యగా మారుతోంది. ఇటీవల ఏఐ డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం చేయడం.. సెలబ్రిటీల ముఖాలను మార్చి అశ్లీలంగా ఉన్న ఫోటోలు, వీడియోలుగా రూపొందించడం తీవ్ర కలవరం సృష్టిస్తోంది. తాజాగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో రూపొందించడం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇలాంటివి తీవ్ర ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ పాట పాడినట్లు ఉన్న ఒక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏఐని ఇలా దుర్వినియోగం చేసి డీప్ఫేక్ వీడియోలు సృష్టించడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. డీప్ఫేక్ వీడియోలు సమాజానికి పెనుముప్పుగా మారుతున్నాయని మండిపడింది. ఇలాంటి వీడియోలు సమాజంలో గందరగోళానికి కారణం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా తాను పాట పాడినట్లుగా ఉన్న ఒక వీడియో వైరల్ అవుతోందని దాన్ని కొందరు తనకు పంపించారని తెలిపారు.
ఈ డీప్ఫేక్ వీడియోలపై మీడియా, జర్నలిస్టులు.. ప్రజలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని ప్రధాని మోదీ సూచించారు. రోజు రోజుకూ అప్డేట్ అనుతున్న టెక్నాలజీతో వచ్చే సమస్యలు, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి.. వాటి నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని వ్యాఖ్యానించారు. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినపుడు వాటిని ఫ్లాగ్ చేసి, వార్నింగ్ ఇవ్వాలని ఈ సందర్భంగా చాట్జీపీటీ బృందాన్ని తాను కోరినట్లు ప్రధాని వెల్లడించారు.
ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్నకు చెందిన ఓ డీప్ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్లు కత్రినా కైఫ్, కాజోల్ కూడా ఈ డీప్ఫేక్ వీడియోల బారినపడ్డారు. దీంతో ఈ వీడియోలపై నెటిజన్లు, సెలబ్రిటీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలపై ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలపై ఫిర్యాదు అందిన 36 గంటల్లోపు వాటిని తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్ఫాంలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు పాటించని సంస్థలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa