ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5 రోజులుగా టన్నెల్‌లోనే 40 మంది.. రంగంలోకి దిగిన విదేశీ రెస్క్యూ టీమ్‌లు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 11:02 PM

ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిన ఘటనలో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘోర దుర్ఘటన జరిగి 5 రోజులు పూర్తవుతున్నా.. అందులో చిక్కుకున్న 40 మంది కార్మికులు మాత్రం ఇప్పటికీ అందులోనే మగ్గిపోతున్నారు. వారికి పైపుల ద్వారా ఆహారం, ఆక్సిజన్, ఔషధాలు పంపిస్తున్నప్పటికీ వారి ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు.. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు విదేశీ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.


నవంబర్ 12 వ తేదీన నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్‌లో కొంత భాగం కూలిపోయింది. ఆ సమయంలో 40 మంది కార్మికులు అందులో చిక్కుకున్నారు. అయితే అప్పటి నుంచి నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2018 లో థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకున్న పిల్లలను విజయవంతంగా రక్షించిన.. థాయ్‌లాండ్, నార్వేకు చెందిన ఎలైట్ రెస్క్యూ టీమ్‌లను పిలిపించి సహాయక చర్యల్లో ఉపయోగిస్తున్నారు.


ఇప్పటివరకు టన్నెల్‌లో చిక్కుకున్న వారి కోసం 30 మీటర్ల వరకు డ్రిల్ చేసి ఆహారం, ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఐదు పైపులను అమర్చారు. ఆ టన్నెల్‌లో ఇరుక్కుపోయి బయటికి రాకుండా ఎక్కువ కాలం అందులోనే ఉండటం వల్ల వారు తీవ్ర భయాందోళనలకు గురవుతారని నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ అగర్వాల్ తెలిపారు. అక్కడ ఉండే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు వంటి పరిసర పరిస్థితులు కూడా వారి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వెల్లడించారు. చల్లని భూగర్భ ఉష్ణోగ్రతలో ఎక్కువ రోజులు ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి.. వారు అపస్మారక స్థితికి చేరుకోవచ్చని తీవ్ర హెచ్చరికలు చేశారు.


మూసి ఉన్న ఒక సొరంగంలో దాదాపు 40 మంది కార్మికులు అంతా ఒకేచోట శ్వాస తీసుకుని.. వదిలేయడం వల్ల కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతాయని.. దీనివల్ల వారిలో శ్వాస సమస్యలు పెరుగుతాయని నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ కార్డియాక్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ అజయ్ కౌల్ అన్నారు. సొరంగం లోపల ఆక్సిజన్ లేక అస్ఫిక్సియా అనే ఊపిరి ఆడని పరిస్థితికి దారి తీస్తుందని.. అది చాలా తీవ్రమైన సమస్య అని తెలిపారు.


ఇక ఉత్తరాఖండ్ టన్నెల్‌లో సహాయక చర్యల కోసం విదేశీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమెరికన్ ఆగర్ యంత్రాన్ని తీసుకురావడం కాస్త పనుల్లో వేగాన్ని తీసుకువచ్చింది. ఈ మెషీన్ 70 మీటర్ల రాళ్లను కూడా తొలగించడంలో సహాయపడుతుందని అధికారులు తెలిపారు. ఆ అమెరికన్ మిషన్ గంటకు 5 మీటర్లు సొరంగాన్ని తవ్వుతుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa