అనంతపురంలో చీరల వ్యాపారమని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.. ప్రతి రోజూ జనాలు వచ్చి వెళుతున్నారు. ఎందుకో అనుమానం వచ్చి ఆరా తీస్తే.. అసలు గుట్టు బయటపడింది. నగరానికి చెందిన సునీల్కుమార్ హైదరాబాదులో ఓ స్కానింగ్ యంత్రాల కంపెనీలో పనిచేసేవాడు. ఏడాది క్రితం తిరిగి అనంతపురం వచ్చేశాడు. ఆయన భార్య ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. వీరు ఇందిరా నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకకు సునీల్ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. స్కానింగ్లో తనకున్న పరిజ్ఞానంతో గర్భస్థ లింగనిర్ధారణ చేయడం మొదలుపెట్టాడు.
సునీల్ ఏకంగా ఇంట్లోనే స్కానింగ్ మెషిన్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కో స్కానింగ్కు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఇందిరానగర్లో కొందరు అనుమానించడంతో రామచంద్రనగర్ కొత్త రైల్వే గేటు దగ్గరకు మకాం మార్చాడు. అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు. రోజూ గర్భిణులను బైక్పై తన ఇంటికి తీసువస్తుండటంతో సీపీఎం నేత ఒకరికి అనుమానం వచ్చి నిఘా పెట్టారు. ఐద్వా నేతతో కలిసి మంగళవారం సునీల్ ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. అక్కడ లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి వెంటనే వైద్యాధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సీపీఎం నేతలు ఇచ్చిన సమాచారంతో డీఎంహెచ్వో, నాలుగో పట్టణ పోలీసులు సునీల్ ఇంటిని తనిఖీ చేశారు. అక్కడ లింగ నిర్ధారణ పరికరాలు, బెడ్లు, లింగ నిర్ధారణ చేయించున్నవారి వివరాలు దొరికాయి. రోజుకు 6 నుంచి 8 మందికి పరీక్షలు చేసినట్లు గుర్తించారు. మంగళవారం కూడా నలుగురికి లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఓ బుక్లో ఎంటర్ చేసి ఉంది. ఇదంతా చూసిన అధికారులు, పోలీసులు అవాక్కయ్యారు. ఆ ఇంటిని సీజ్ చేశారు.
సునీల్ మూడు నెలల క్రితం అద్దె ఇంట్లో చేరే సమయంలో తాము చీరల వ్యాపారం చేస్తామని ఇంటి యజమానిని సునీల్ నమ్మించాడు. రోజూ వస్తున్న మహిళలు చీరల కోసమే అన్నట్లు బురిడీ కొట్టించాడు. డీఎంహెచ్వో ఫిర్యాదుతో పోలీసులు సునీల్ను, అతని సహాయకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని.. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సునీల్, శ్రావణిలు తాము అడిగిన వివరాలు చెప్పటం లేదని.. వారి వెనుక ఎవరైనా వైద్యులున్నారా, గర్భిణులకు ఏ ఆసుపత్రుల్లో అబార్షన్లు చేయిస్తున్నారా అన్న వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉందన్నారు. సీపీఎం నేత ఫిర్యాదు చేసిన వెంటనే తనిఖీల చేశామని.. నిందితులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa