టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 1 నుంచి మళ్లీ పార్టీతో పాటూ ఇతర కార్యక్రమాల్లో యాక్టివ్ కాబోతున్నారు. చంద్రబాబు తిరుమల శ్రీవారిని డిసెంబరు 1న కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రానికే తిరుమల చేరుకోనున్న ఆయన రాత్రి కొండ మీదే బస చేయనున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనం అయ్యాక రేణిగుంట విమానాశ్రయం నుంచి అమరావతి చేరుకుంటారు. ఆ తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లికార్జున స్వామివార్ల దేవాలయాల్ని సందర్శిస్తారు.
ఇటీవలే కంటి శస్త్రచికిత్స చేయించుకున్న చంద్రబాబు కొంతకాలంగా హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని రోజులు కంట్లో దుమ్ము పడకుండా జాగ్రత్త పడాలని వైద్యులు సూచించడంతో ఇంటికే పరిమితమయ్యారు. అయినా కొన్ని నియోజకవర్గాల నేతలను పిలిపించుకుని విడివిడిగా మాట్లాడుతున్నారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో డిసెంబరు మొదటి వారం నుంచి ఆయన పూర్తిస్థాయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.
కంటి చికిత్స తర్వాత మొదటిసారి సోమవారం ఆయన బయటకు వచ్చి ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొన్నారు. వాస్తవానికి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్పై జైలు నుంచి బయటకు రాగానే మొదట తిరుమలకే వెళ్లాలని అనుకున్నారు. కానీ అనారోగ్య సమస్యలు ఉండడంతో వైద్యుల సూచనతో హైదరాబాద్ వెళ్లారు. డిసెంబర్ నుంచి మళ్లీ బిజీ కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa