ఏపీకి తుఫాన్ ముప్పం పొంచి ఉందని వాతావరణశాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫాన్గా మారొచ్చని అంచనా వేస్తున్నారు. అది తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదు. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్లో ఏర్పడే తుపాన్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో తీరం దాటుతాయని భావిస్తున్నారు. వాతావరణ మార్పు కారణంగా ఈ సీజన్లో ఇప్పటికే రెండు తుఫాన్లు ఉత్తరదిశగా వెళ్లిపోయాయి. తమిళనాడు నుంచి ఏపీ వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం దీనికి ఒక కారణం అంటున్నారు. ఈ ఏడాది రెండు తుఫాన్ దిశ మార్చుకోవడంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఆశించినంత స్థాయిలో వానలు లేవు. పసిఫిక్ సముద్రం మీదుగా వచ్చే తూర్పుగాలుల ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మంచి వర్షపాతం నమోదవుతోంది. గతంలో తూర్పుగాలుల ప్రభావం రాష్ట్రం వరకూ ఉండి.. మంచి వర్షాలు పడేవి. ప్రస్తుతం ఆ గాలులు తమిళనాడు వరకే పరిమితమయ్యాయి. ఇటీవల కాలంలో తుఫాన్ల గమనాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది. ఉష్ణోగ్రతలో 1.5 డిగ్రీల పెరుగుదల, కాలుష్యం అధికమవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. మిచౌంగ్ తుఫాన్ దిశ మార్చుకుంటే ఇప్పట్లో రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు అవకాశాల్లేవు అంటున్నారు. ఉత్తరకోస్తా ప్రాంతంలో తీరం దాటితే కొంతవరకు ప్రయోజనం ఉంటుందంటున్నారు.
బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం శుక్రవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఆదివారానికి తుఫాన్గా మారుతుందన్నారు. తర్వాత వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారానికి ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా మధ్యలో తీరానికి చేరువగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తుఫాన్ తీరం దాటడంపై శుక్రవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనా ప్రకారం తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా కదులుతోంది. తుఫాన్గా మారేందుకు సముద్రం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తిరుపతి జిల్లా తడలో 137.4, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 100.8, తిరుపతి జిల్లా సత్యవేడులో 74.8, తిరుపతిలో 59.8, తిరుపతి జిల్లా తొట్టెంబేడులో 49.2, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 48.4, తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 44.2, తిరుపతి జిల్లా గూడూరులో 36.4, నెల్లూరులో 31.5, నెల్లూరు జిల్లా కావలిలో 28.1, అన్నమయ్య జిల్లా పెనగలూరులో 24.6, నెల్లూరు జిల్లా రాపూరులో 24.4, నెల్లూరు జిల్లా కందుకూరులో 22.2, నెల్లూరు జిల్లా వింజమూరులో 21.2, చిత్తూరు జిల్లా పెనమలూరులో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తుఫాన్ హెచ్చరికలతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, రైతులకు అందుబాటులో ఉండాలని అధికారులు సూచించారు. వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నందున.. కోతలు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. కోతల్లో, కొనుగోళ్ల సమయంలో ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్నారు. ఖరీఫ్లో తక్కువ వర్షపాతం నమోదైనందున క్షేత్రస్థాయి సిబ్బంది లక్ష్యం మేరకు పంట కోత ప్రయోగాలపై దృష్టి పెట్టాలన్నారు. ఈ క్రాప్ నమోదుకు ఖరీఫ్లో ఇచ్చిన మార్గదర్శకాలే రబీలోనూ వర్తిస్తాయన్నారు. త్వరగా కోతకు వచ్చే శనగ, మినుము, మొక్క జొన్న పంటలను త్వరగా ఈ క్రాప్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. వచ్చే 3, 4 రోజుల్లో కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకునేందుకు రైతులకు అవసరమైన విత్తనాలను అందించాలని సూచించారు. శనగ విత్తనాల కోసం డిసెంబర్ 15 లోగా ఇండెంట్ పెట్టాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa