తిరుమల శ్రీవారి హుండీకి చాలా రోజుల తర్వాత భారీగా ఆదాయం వచ్చింది. సోమవారం 64,882మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే.. హుండీకి రూ.5.28 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అలాగే 24,900మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం 13 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ సర్వ దర్శనం టికెట్ లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారికి దాదాపు రెండు, మూడు నెలలుగా ఒక్కరోజు ఆదాయం రూ.5 కోట్లు దాటలేదు.. సోమవారం మళ్లీ ఆ మార్క్ను అందుకుంది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సందర్బంగా డిసెంబరు 17 నుండి 2024 జనవరి 14వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీశ్రీశ్రీ పెరియకోయిల్ కేల్వి అప్పన్ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్స్వామి మఠంలో నెల రోజుల పాటు ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుప్పావై పాశురాలను పారాయణం చేస్తారు. ఈ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భగవద్ రామానుజాచార్యుల కాలంలో తిరుమలలో పెద్దజీయర్ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల పరంపరలో వస్తున్న జీయర్స్వాములు తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో 11 రోజుల పాటు జరిగిన శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) సోమవారం శాస్త్రోక్తంగా ముగిసింది. ఆలయంలో హోమ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉదయం రుద్రయాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉద్వాసన, శ్రీ కపిలేశ్వరస్వామి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు శివపార్వతుల కల్యాణోత్సవం జరిగింది.
తరువాత రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ చండికేశ్వరస్వామివారి కలశ స్థాపన, కలశ ఆరాధన, హోమం నిర్వహించనున్నారు. డిసెంబరు 12న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa