యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు గాయమైంది. పరవాడ మండలంలోకి పాదయాత్ర వచ్చే సమయంలో లోకేష్ కుడిచేతి చీలమండకు కొద్దిపాటి గాయమైంది. పాదయాత్రలో లోకేష్ అభిమానులకు అభివాదం తెలిపే సమయంలో ఆయన చేతిని ఒక వ్యక్తి బలంగా నొక్కాడు. దీంతో చేతి చీలమండపై నరం ఒత్తిడికి గురై వాచిపోయిందని చెబుతున్నారు. గాయమైనా సరే లోకేష్ పాదయాత్రను కొనసాగించారు. అభిమానులకు కరచాలనం చేసేటప్పుడు ఎడమ చేతిని మాత్రమే ఉపయోగించారు. మధ్య మధ్యలో లోకేష్ గాయానికి ఐస్క్యూబ్లతో మర్దన చేశారు. ఆ నొప్పిని భరిస్తూనే పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
మరోవైపు యువగళం పాదయాత్రలో ఆదివారం పలువురు ఐటీ నిపుణులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. వీరంతా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి మూడు ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చారు. తోటాడ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ నుంచి పరవాడ నియోజకవర్గం భరణికం వరకు లోకేష్తో కలిసి నడిచారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం గర్వంగా భావిస్తున్నామన్నారు ఐటీ నిపుణులు. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం అభివృద్ధి చెందడంతో అనేక మందికి ఉపాధి కలిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తామంతా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో పనిచేస్తున్నామని.. అదే మన రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందితే తమతో పాటు అనేక మందికి ఇక్కడే ఉపాధి దొరుకుతుందన్నారు. అది చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.
మరోవైపు నారా లోకేష్ పాదయాత్ర నేటితో ముగియనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న లోకేష్ యువగళంను ప్రారంభించారు.. ఇవాళ విశాఖ జిల్లా అగనంపూడి దగ్గర ముగుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రనూ అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంటుతో ఇప్పుడు లోకేష్ అక్కడే ముగిస్తున్నారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజులపాటు పాదయాత్ర సాగింది. సోమవారం ముగించే సమయానికి లోకేష్ 3,132 కి.మీ. నడిచినట్టవుతుంది. విజయోత్సవ సభనూ దృష్టిలో పెట్టుకుంటే ఒక్క శ్రీకాకుళం తప్ప 12 ఉమ్మడి జిల్లాలను కవర్ చేయాలని భావిస్తున్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపుసభకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 70 ఎకరాల్లో వేదికతో పాటు సభా ప్రాంగణం ఉండనుంది. 160 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో వేదికను సిద్ధం చేస్తున్నారు. ఆరు లక్షల మందికి సరిపడేలా కుర్చీలు వేస్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి పార్టీశ్రేణులు తరలివచ్చేందుకు ఏడు రైళ్లను, వందల ప్రైవేటు బస్సులు, వేల కార్లు, ఇతర వాహనాలను ఏర్పాటుచేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు విజయనగరం చేరుకోనున్నాయి. వారిని సభా ప్రాంగణానికి చేర్చేందుకు బస్సులు, ఇతర వాహనాలను సమకూర్చారు. ఈ సభకు చంద్రబాబుతో పాటుగా పార్టీ నేతలు, నారా, నందమూరి కుటుంబసభ్యులు హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa