పరారీలో ఉన్న అండర్వరల్డ్ డాన్, 93 ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారనే ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. కరాచీలోని ఓ ఆస్పత్రిలో భారీ భద్రత నడుమ అతడికి చికిత్స అందిస్తున్నట్లు పలు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దావూద్ చనిపోయాడని సోషల్ మీడియాలో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలనీ అతడు కొట్టి పారేశాడు. దావూద్ ప్రాణాలతో ఉన్నారని, చాలా ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించారు. ‘దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నారు.. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు.. విషప్రయోగం జరిగిందని, అస్వస్థతతో ఆస్పత్రిలో ఉన్నారనే వదంతులు చూసి షాకయ్యారు.. నిన్ననే చాలాసార్లు ఆయన్ను కలిశాను’ అని చోటా షకీల్ తెలిపారు. దావూద్ చనిపోయినట్టు పలువురు సోషల్ మీడియాలో పోస్ట్లు కూడా పెట్టడం గమనార్హం.
దావూద్ మరణించాడని పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ అకౌంట్ స్క్రీన్ షాట్లను కూడా కొందరు పోస్ట్ చేశారు. అయితే ఆ మెసేజ్, అకౌంట్ ఫేక్ అని తేలింది. ‘మానవత్వానికి మారుపేరు.. ప్రతి పాకిస్థానీ హృదయానికి ప్రియమైన దావూద్ ఇబ్రహీం తెలియని విషం కారణంగా మరణించారు.. కరాచీలోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.. అల్లా అతనికి స్వర్గంలో అత్యున్నత స్థానాన్ని ప్రసాదించుగాక’ అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. సీబీఐ ప్రకారం.. దావూద్ తన గుర్తింపును దాచడానికి 13 మారుపేర్లను ఉపయోగిస్తాడు. 1980-90వ దశకం ప్రారంభంలో వ్యభిచారం, జూదం, డ్రగ్స్ కార్యకలాపాలతో ముంబై అండర్ వరల్డ్ డాన్గా మారాడు. 1980లలో ముంబై ఆర్థిక పతనం కొత్తగా ఏర్పడిన మాఫియాలకు దారి తీసింది. 1986లో క్రిమినల్ విచారణ నుంచి తప్పించుకునేందుకు దుబాయ్ పారిపోయాడు. పలు వేషాలు మారుస్తూ పోలీసులు, దర్యాప్తు సంస్థలకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
పాకిస్థాన్లో దావూద్ ముఠా సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతోందని ఆరోపణలు ఉన్నారు. షకీల్ తన అనుచరుల ద్వారా దోపిడీ రాకెట్ను నడుపుతున్నాడు. దావూద్ ఇబ్రహీం, అతడి ముఠాపై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల సలీం ఖురేషీ అలియాస్ సలీమ్ ఫ్రూట్ను ప్రశ్నించింది. అతడు వెల్లడించిన వివరాల ప్రకారం 1995-96లో భారత్ను విడిచిపెట్టిన దావూద్.. అప్పటి నుంచి పాకిస్థాన్లో ఆశ్రయం పొందుతున్నాడు. 1993లో ముంబయిలో జరిగిన భీకర పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్కు పారిపోయాడు. కానీ, పాక్ ఇప్పటి వరకూ దీనిని అంగీకరించలేదు. కాగా, పాకిస్థాన్లో ఆదివారం రాత్రి నుంచే ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు సమాచారం. యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికలు కూడా డౌన్ అయినట్లు సమాచారం. ముఖ్యంగా కరాచీ, లాహోర్, రావల్పిండి వంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు పాక్లోని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa