తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాలకు 71,488మంది వచ్చారు. అలాగే 19,137 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.17 కోట్లు ఆదాయం వచ్చింది. శ్రీవారిని నాలుగు రోజుల్లో 2,72,207 మందికి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. నాలుగు రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం 15.37 కోట్లు వచ్చింది. జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. మరోవైపు టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి పోటు కార్మికులకు రూ.10 వేల దాకా వేతనం పెంచాలని నిర్ణయించారు. శాశ్వత ఉద్యోగులు కానివారికి రూ.28 వేల జీతం అందుతోందని.. అయితే వీరి సేవలను దృష్టిలో పెట్టుకుని రూ.38 వేలకు పెంచామన్నారు. వాహనబేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి వేతనం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. టీటీడీలోని పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలు పెంచామన్నారు.
స్కిల్డ్ కార్మికులకు రూ.15 వేల నుంచి రూ.18,500కు, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు, ఆన్స్కిల్డ్ కార్మికులకు రూ.10,340 నుచి 15 వేలకు పెంచామని వివరించారు.జీవో 110 ప్రకారం కల్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న పీస్రేట్ క్షురకులకు నెలకు రూ.20 వేల కనీస వేతనం చెల్లించేందుకు ఆమోదం తెలిపామన్నారు. ఈనెల 28న 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాలను పంపిణీ చేస్తామన్నారు. రెండో దఫా జనవరి మొదటివారంలో మరో 1,500 మందికి అందజేస్తామన్నారు. మూడో దఫాలో ఏర్పేడు మండలం పాగాలి వద్ద 350 ఎకరాల భూమి కోసం కలెక్టరును కోరామన్నారు. దీని వలన 5 వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. వీరికి కూడా ఫిబ్రవరిలో ఇళ్లస్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో విశ్రాంత ఉద్యోగులకు, ప్రస్తుత ఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు అందించినట్టవుతుందన్నారు. టీటీడీ భూమిని కొనుగోలు చేసి అభివృద్ధి చేసి ఉద్యోగులకు అందిస్తుందన్నారు. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారన్నారు.
పోటు కార్మికులకు 10 వేల జీతం పెంచుతూ మంగళ వారం నిర్ణయం తీసుకోవడం పట్ల తిరుమల శ్రీవారి ఆలయ పోటు కార్మికులు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం శ్రీవారి దర్శనానికి వెళ్ళిన చైర్మన్ను పోటు కార్మికులు ఆలయంలో కలసి కృతఙ్ఞతలు తెలిపారు. తమకు ఒక్క సారిగా 10వేల జీతం పెరుగుతుందని కలలో కూడా ఊహించలేదని వారు సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలు కృతజ్ఞతగా ఉంటాయని చెప్పారు. సుమారు 600 కుటుంబాలకు దీని వల్ల ప్రయోజనం కలిగిందని వారు చెప్పారు. అంతకు ముందు వాహనం బేరర్లు చైర్మన్ ను కలసి తమ అభ్యర్థన మన్నించి తమను స్కిల్డ్ వర్కర్స్ గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అడిగిన వెంటనే ఈ సహాయం చేస్తారని తాము ఊహించలేదని కృతఙ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa