కర్ణాటకలో మరో వివాదం చెలరేగింది. అన్ని దుకాణాల ముందు ఉండే సైన్ బోర్డులపై కన్నడ భాషనే ఉపయోగించాలనే డిమాండ్ వెల్లువెత్తింది. ఈ క్రమంలోనే స్పందించిన బెంగళూరు కార్పొరేషన్.. అందరు దుకాణదారులకు ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా దుకాణాల ముందు ఉండే నేమ్ బోర్డులపై కన్నడ భాషలో పేర్లు రాయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కొందరు కన్నడ పరిరక్షణ సంఘాల నేతలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉన్న బోర్డులను ధ్వంసం చేయడం, తొలగించడం చేస్తున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని బెంగళూరు తీవ్ర ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
అన్ని దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తమ సైన్ బోర్డుల్లో స్థానిక కన్నడ భాషనే ఉపయోగించాలని ఇటీవలే బృహత్ బెంగళూర్ మున్సిపాలిటీ పాలికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బెంగళూరులో కన్నడ రక్షా వేదికకు చెందిన కార్యకర్తలు ఓ హోటల్ను ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న నేమ్ బోర్డును చించేసి నానా హంగామా సృష్టించారు. దీంతో వారు చేపట్టిన నిరసన కాస్తా హింసాత్మకంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కన్నడ రక్షా వేదిక కార్యకర్తలను అడ్డుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వ తేదీలోగా బెంగళూరు నగరంలోని వాణిజ్య సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు.. తమ నేమ్ బోర్డులపై 60 శాతం కన్నడ భాషను ఉపయోగించాలని ఇటీవలె బృహత్ బెంగళూర్ మున్సిపాలిటీ పాలికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లేని పక్షంలో ఆ దుకాణం ట్రేడ్ లైసెన్స్ను రద్దు చేస్తామని.. ఆపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అయితే ఈ నిబంధన తమకు తెలియదని.. అందుకే పాటించడం లేదని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య కన్నడ భాషను బాగా ప్రమోట్ చేసేవారు. కర్ణాటకలో నివసించేవారు ఎక్కువగా కన్నడ భాషను ఉపయోగించాలని కోరారు. కన్నడను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన ప్రభుత్వ యంత్రాంగం ఆరు నెలల్లోగా కన్నడ నేర్చుకోవాలని బ్యాంకు అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇక బెంగళూరు మెట్రో స్టేషన్లలో హిందీ పేర్లను టేప్తో కప్పి ఉంచడం గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa