తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసే వేలాది మంది భక్తులకు తిరుపతిలో మరింత సౌకర్యవంతంగా వసతి కల్పించేందుకు టీటీడీ అచ్యుతం, శ్రీపథం వసతి సమూదాయాలు నిర్మిస్తోంది. ఈ మేరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి(రెండు), శ్రీ కోదండరామస్వామి(మూడు) సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తో కలసి శంకుస్థాపన చేశారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, బస తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు టీటీడీ ఛైర్మన్. భక్తులకు మరింత మెరుగ్గా బస కల్పించడంలో భాగంగా తిరుమల, తిరుపతిలో ఉన్న విశ్రాంతి గృహాల్లో అవసరమైన వాటిని ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతిలో దాదాపు 70 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ గోవిందరాజస్వామి సత్రం (రెండో సత్రం) స్థానంలో రూ.209 కోట్లతో అచ్యుతం, శ్రీ కోదండరామస్వామి సత్రం(మూడో సత్రం) స్థానంలో రూ.209 కోట్లతో శ్రీపథం వసతి సముదాయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు.
ఒక్కో బ్లాకులో 4100 మంది చొప్పున మొత్తం 8200 మంది భక్తులు ఇక్కడ బస చేసే అవకాశముందన్నారు. ఇందులో దాదాపు 200కు పైగా కార్లు, ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఒక్కో బ్లాక్ను 7.04 లక్షల చదరపు అడుగు విస్తీర్ణంలో ఎనిమిది ఫ్లోర్లతో నిర్మిస్తామన్నారు. మొదటి ఫ్లోర్లో రిసెప్షన్, ఎస్ఎస్డి టోకెన్ కౌంటర్లు, మహిళలకు, పురుషులకు వేరువేరుగా జనరల్ టాయిలెట్లు, మెడికల్ డిస్పెన్సరీ, కార్యాలయ గదులు, రెండు రెస్టారెంట్లు, శ్రీవారి సేవకుల కోసం ఐదు హాళ్లు, స్టోర్ రూమ్ ఉంటాయన్నారు.
రెండు, మూడు ఫ్లోర్లలో అన్నప్రసాదం హాలు, 500 మంది యాత్రికులు బస చేసేందుకు వీలుగా 23 డార్మిటరీ హాళ్లు, జనరల్ టాయిలెట్లు నిర్మించనున్నట్లు తెలిపారు. నాలుగో ఫ్లోర్ నుండి ఎనిమిదో ఫ్లోర్ వరకు ఒక్కో ఫ్లోర్లో 8 ఫ్యామిలీ సూట్ రూమ్లు, 100 గదులు, మొత్తం 540 గదులు ఉంటాయని చెప్పారు. వీటిని మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఈ నిర్మాణాలను పూర్తి చేస్తామని ఛైర్మన్ వివరించారు. ఈ రెండు వసతి సముదాయాలు అందుబాటులోకి వస్తే తిరుమల వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతి కల్పించే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది. తిరుమలలో గదులు దొరకని భక్తులకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద టీటీడీ సామాన్య భక్తుల కోసం కీలక ముందడుగు వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa