శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో డిసెంబర్ 31, జనవరి 1న ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికి త్వరితగతిన దర్శనాలు కల్పించడంలో భాగంగా స్వామివారి స్పర్శ దర్శనం, గర్భాలయ అభిషేకాలు కూడా నిలిపివేస్తున్నామన్నారు. సామూహిక అభిషేకాలు, బ్రేక్ టికెట్ పొందిన భక్తులకు కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది. ఆర్జిత హోమాలు, అమ్మవారి కుంకుమార్చనలు యథావిధిగా ఉంటాయని.. అర్జిత హోమాలు, కుంకుమార్చన టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.
మరోవైపు జనవరి 3 నుంచి ఆలయంలో నూతనంగా ప్రాతఃకాలసేవను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉదయాస్తమానసేవ (రూ. 1,01,116) ఆర్జితసేవ యథావిధిగా కొనసాగుతుంది. అయితే ఉదయం వేళలో రూ.25,116 రుసుంతో ప్రాతఃకాలసేవను ప్రవేశపెట్టేందుకు దేవదాయశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. అయితే రోజులో ఒక ఉదయాస్తమానసేవ, ఐదు ప్రాతఃకాలసేవ రెండింటిని కలిపి మొత్తం ఆరు టికెట్లను దేవస్థానం జారీ చేయనుంది. ప్రాతఃకాలసేవలో పాల్గొనే సేవాకర్తలు(ఒకరు లేదా దంపతులు)కు స్వామివారి మహామంగళహారతి, ప్రత్యేక పంచామృత అభిషేకం (స్వామివారి గర్భాలయంలో), అమ్మవారికి కుంకుమార్చన, వేదాశీర్వచనం, స్వామివారి శేషవస్త్రం, కాటన్ పంచె, చీర, జాకెట్ పీస్, ఒక రోజు వసతి కల్పించనున్నారు. అలాగే పది సంవత్సరాల్లోపు పిల్లలకు ఉచితంగా స్వామివారి స్పర్శదర్శనం కల్పించనున్నారు.
ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం శ్రీశైల దేవస్థానంలో రూ.215.4 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. రూ. 75 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్, రూ. 52 కోట్టతో 200 గదుల యాత్రికుల వసతి సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.35 కోట్లతో శివసేవకుల వసతి గృహ నిర్మాణం, రూ.7కోట్లతో ఒక మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్, రూ.5.85 కోట్లతో దేవస్థానం ఉద్యోగుల నివాస సముదాయినికి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, సబ్స్టేషన్ పనులకు శ్రీకారం చుట్టారు. రూ.5.50 కోట్లతో హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి డంపింగ్ యార్డ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం.. రూ.2.60 కోట్లతో వెయ్యి కి.లీ వాటర్ స్టోరేజీ రిజర్వాయర్ నిర్మాణం, రూ.2 కోట్ల వ్యయంతో హటకేశ్వరంలో 500 కి.లీ వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్ నిర్మాణం, రూ. 1.60 ఫిల్టర్ బెడ్ ఏరియాలో 500 కి.లీ వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్ నిర్మాణం, రూ.1.98 కోట్లతో దోర్నాలలో కల్యాణమండపం నిర్మాణం చేపట్టనున్నారు. వీటితో పాటుగా మరికొన్ని పనుల్ని కూడా చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa