విశాఖలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలు చనిపోయిన వారం రోజులకు బయటపడింది. ఇంట్లో కుమారుడు ఉండి కూడా ఆమె మృతిని గుర్తించలేదు. నగరంలోని బీచ్రోడ్డు కురుపామ్ టవర్ రెండో అంతస్తులో ఇనగంటి శ్యామల (67).. తన కుమారుడు ఇనగంటి శరవణ్కుమార్(27)తో కలిసి నివాసం ఉంటున్నారు. జనవరి 1 నుంచి ఆ ఇంటి తలుపు తీయకపోవడం.. ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా.. వృద్ధురాలు సోఫాలో చనిపోయి ఉన్నారు. కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు.
కుమారుడ్ని పోలీసులు అతన్ని ప్రశ్నించగా.. తన తల్లి నిద్రపోతుందని సమాధానం చెప్పాడు. వారం రోజులుగా ఇంట్లో పండ్లు, చిరుతిళ్లు తిని గడుపుతున్నాడు. శరవణ్కుమార్ బీటెక్ పూర్తిచేసి 2018 నుంచి 2020 వరకు బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అనంతరం ఉద్యోగం మానేసి విశాఖలో తన తల్లితో కలిసి ఉంటున్నాడు. అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో మరో ఉద్యోగంలో చేరలేదని చెబుతున్నారు. తండ్రి బాలసుబ్రహ్మణ్యం మృతిచెందారు. శరవణ్కుమార్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే తల్లి చనిపోయిన విషయం కూడా గుర్తించలేదని పోలీసులు భావిస్తున్నారు. గుండెపోటుతో ఆమె మృతిచెంది ఉంటుందని.. జనవరి 1 నుంచి తలుపులు తీయకపోవడంతో అదే రోజు సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa