సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో కోడి పందేలు నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది మూగ జీవాలపై క్రూరత్వమేనని, వాటిని నిలువరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్రావుతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పందేలు భారీస్థాయిలో జూదానికి అవకాశం కల్పిస్తున్నాయని, వీటిని నిలువరించేందుకు హైకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లను ముఖ్యంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది.
సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు నిర్వహణ, విచ్చలవిడిగా జూదాన్ని అడ్డుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన హనుమ అయ్యప్ప హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కేవీ ఆదిత్య చౌదరి.. కోడిపందేల నిర్వహణ జంతు హింస నిరోధక చట్ట నిబంధనలకు విరుద్ధమని వాదించారు. వీటిని నిరోధించాలని హైకోర్టు గతంలో కీలక ఉత్తర్వులిచ్చినా.. అధికారులు ఈ తీర్పును అమలు చేయడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని పునరుద్ఘాటించింది. కోడిపందేలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. అందులో భాగంగా జంతుహింస నిరోధక చట్టం-1960, ఏపీ జూద నిరోధక చట్టం-1974ను కఠినంగా అమలుచేయాలని తేల్చిచెప్పింది. చట్టాలను సక్రమంగా అమలు చేయకపోతే కలెక్టర్, పోలీసు కమిషనర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హెచ్చరికలు చేసింది. ఈ నెల 14లోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించింది.
ఎస్సై స్థాయి పోలీసు అధికారి, తహసీల్దార్, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల నుంచి ఒక సభ్యుడు ఆ టీం ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి తనిఖీ బృందంలోనూ ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక ఫొటోగ్రాఫర్ ఉండేలా చూడాలని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa