సంక్రాంతి పండుగ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు కొనసాగుతున్నాయి. కోడి పందేలను నియంత్రించాలని హైకోర్టు ఆదేశించినా.. ఎక్కడా జోరు ఆగడం లేదు. అయితే, పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పా పెంటపాడు కోడి పందాల బరిలో ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు తెగబడ్డారు. పందేల విషయంలో వివాదం రేగడంతో ఉద్రిక్తతలు నెలకున్నాయి. తాడేపల్లిగూడెం గ్రామీణ పోలీస్టేషన్కు చెందిన హోమ్ గార్డ్ మజ్జి అప్పారావు మద్యం మత్తులో గొడవకు దిగడంతో వివాదం మొదలయ్యింది.
పందేల కోసం స్టాల్స్ ఏర్పాటు, లక్షల రూపాయలు బెట్టింగులు, బరిలో ఏకంగా కౌంటర్ ఏర్పాటు చేసి యధేచ్ఛగా మద్యం అమ్మకాలు జరపడంతో వివాదం రేగిందని స్థానికులు చెబుతున్నారు. కానీ, ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని, ఆపే ప్రయత్నం చేయడంలేదని విమర్శిస్తున్నారు. కాగా, కోడి పందేల బరిలో అపశృతి దొర్లింది. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో కోడి కత్తి కట్టి పందెం వేస్తున్న సమయంలో ఆ కత్తి తగిలి యువకుడికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువకుడికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసి.. మెరుగైన వైద్యం కోసం భీమవరం తీసుకెళ్లారు.
కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భోగి రోజు పెద్ద ఎత్తున కోడి పందేలు మొదలయ్యాయి. వీటిలో పాల్గొనడానికి ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో తరలివచ్చారు. సంక్రాంతి సంబరాల పేరుతో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో కోడిపందేలు, కోతముక్క, ఇతర జూద శిబిరాలు నిర్వహిస్తున్నారు. 16వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 25 ఎకరాల ప్రైవేటు స్థలంలో ప్రత్యేకంగా బరులు, వేదికలు ఏర్పాటు చేశారు
వేల సంఖ్యలో వచ్చేవారి కోసం విశాలమైన పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తెచ్చారు. సినిమా సెట్టింగ్లను తలపించేలా స్వాగత ద్వారాలు, బౌన్సర్లు, సందర్శకులకు పాస్లు, ఆటగాళ్లకు టోకెన్ల వంటి ఏర్పాట్లతో హంగామా చేశారు. పందేల మొదటి రోజే రూ.లక్షల్లో నగదు చేతులు మారుతోంది. పందేలను తిలకించేందుకు వస్తున్న వాహనదారులతో చెన్నై-కోల్కతా హైవేతో పాటు సర్వీసు రోడ్లపై ట్రాఫిక్ రద్దీ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa