ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్‌లో యాక్టివ్ అయిన కాంగ్రెస్ పార్టీ,,,,తిరుపతి నుంచి పోటీకి చిరంజీవిపై ఒత్తిడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 09:44 PM

చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, ఆయనకు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పార్టీ ప్రాథమిక సభ్వత్వం ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో చిరంజీవి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మాజీ ఎంపీ పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం వచ్చిందని, మెగాస్టార్ సరైన నిర్ణయం తీసుకోవాలని చింతా మోహన్ కోరారు. పోటీకి చిరంజీవి సముఖంగా ఉంటే తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి గెలిపించి, ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేస్తామని చింతా మోహన్ పునరుద్ఘాటించారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానంతో తాను మాట్లాడతానని చెప్పారు. గతవారం కూడా చింతా మోహన్ ఇటువంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.


ఇదే సయమంలో రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ చర్యల వల్ల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైఎస్ఆర్సీపీకి దూరమయ్యారని.. ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాదు, అంబేడ్కర్ విగ్రహన్ని ఆవిష్కరించే స్థాయి జగన్‌కు లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు. 130 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ఏపీలో కాపు సామాజిక వర్గం నేతలు సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారని ఇటీవల చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కావాలంటే కాపు సామాజిక వర్గానికి ఈ ఎన్నికలు సువర్ణ అవకాశంగా ఆయన అభివర్ణించారు. తిరుపతి నుంచి పోటీ చేస్తే చిరంజీవి సీఎం కావడం పక్కా అని మాజీ ఎంపీ జోస్యం చెప్పారు. చిరంజీవి నామినేషన్ వేస్తే చాలు.. ప్రచారం కూడా చేయాల్సిన పని లేదని.. ఆయనను 50 వేల మెజారిటీతో గెలిపించేందుకు తిరుపతి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోవాల్సింది చిరంజీవేనని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa