ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారం రోజుల పాటు ఢిల్లీ విమానాశ్రయంలో రాకపోకలు బంద్

national |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 10:42 PM

గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయంలో రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తక్షణమే అమల్లోకి వచ్చే ఈ ఆంక్షలు జనవరి 26 వరకూ అమల్లో ఉంటాయని తెలిపింది. ఉదయం 10.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ ఎటువంటి విమానాలకు అనుమతి లేదని ఈ మేరకు నోటీసులు వెలువరించింది. రిపబ్లిక్ డే వేడుకలను దృష్టిలో ఉంచుకుని భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకుంది.


ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు రెండు గంటల పాటు సేవలను నిలిపివేయడం ఆర్థికంగా నష్టం కలిగించినప్పటికీ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది కేంద్రం. అయితే, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, బీఎస్ఎఫ్ వంటి భద్రతా బలగాల హెలికాప్టర్లు, విమానాలు లేదా గవర్నర్లు, ముఖ్యమంత్రులు ప్రయాణించే విమానాలకు మాత్రం ఎటువంటి ఆటంకం ఉండదు. ఇక, కొద్ది వారాలుగా ఢిల్లీలో పొగమంచు కారణంగా వందల విమానాలు రద్దుకావడం, దారిమళ్లించడం, బయలుదేరడంలో జాప్యం వంటివి ఎదురయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. 13 గంటల ఆలస్యం కావడంతో ఢిల్లీ-గోవా ఇండిగో విమానం పైలట్‌పై ఓ ప్రయాణికులు చేయి చేసుకున్న ఘటన కూడా చోటుచేసుకుంది.


ఇక, భారత్ 75వ గణతంత్ర వేడుకలకు సిద్ధం కాగా.. ఈ ఏడాది ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ విచ్చేయనున్న విషయం తెలిసిందే. తొలిసారి బీఎస్ఎఫ్ తరపున పూర్తిగా మహిళా కమాండోలే మార్చ్ నిర్వహించనున్నారు. మరోవైపు, ఇప్పటికే ఢిల్లీ నిఘా నీడలోకి వెళ్లిపోయింది. నగరం మొత్తం పోలీసులు నిఘా పెట్టి, భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు దాడిచేస్తే వాటిని తిప్పికొట్టేందుకు మాక్ డ్రిల్‌ను అక్షరధామ్ ఆలయంలో నిర్వహించారు. ఫిబ్రవరి 15 వరకూ ఢిల్లీ గగనతలంలో డ్రోన్లు, పారగ్లైడర్లు, ఇతర వస్తువుల ఎగరవేతపై నిషేధం విధించారు. 28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 2,274 క్యాడెట్స్ రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొననున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa