అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, అయోధ్య ప్రాణప్రతిష్ఠకు శంకరాచార్య పీఠాధిపతులు తాము హాజరుకావడం లేదని రెండు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వేడుకపై రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా, శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామాజీ.. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్కు గురువారం లేఖ రాశారు. కొత్త విగ్రహం ఏర్పాటు సహా అందులో పలు అంశాలను లేవనెత్తిన ఆయన.. వాటికి సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే రాముడి పాత విగ్రహం ఉండగా, మళ్లీ కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అక్కడ ముందు నుంచే విగ్రహం ఉందనడానికి ఓ ముస్లిం వాచ్మన్ సాక్షిగా కూడా ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ‘కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే.. పాత విగ్రహం ఏమవుతుంది.. రామ్ లల్లా విరాజ్మన్ కోసమే కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారని రామభక్తులు ఇప్పటి వరకూ అనుకున్నారు.. కానీ, ఇప్పుడు కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తుండటంతో పాతది పక్కనబెట్టేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. దాన్ని పక్కన బెట్టేస్తారా? అంతేకాదు, ఆలయ నిర్మాణం పూర్తికాకుండా ప్రారంభోత్సవం ఏంటి?’ అని నిలదీశారు.
తన ఆరు ప్రశ్నలకు ట్రస్ట్ సమాధానం ఇవ్వాలని శంకరాచార్య డిమాండ్ చేశారు. ఆలయ ప్రాణప్రతిష్ఠ తర్వాతే అయోధ్యను తాను సందర్శిస్తానని వెల్లడించారు. కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠం, గుజరాత్లోని ద్వారకా శారదా పీఠం, ఉత్తరాఖండ్లోని జ్యోతిర్ పీఠం, ఒడిశాలోని గోవర్దన్ పీఠం శంకరాచార్యులు ప్రాణప్రతిష్ఠ వేడుకకు దూరంగా ఉంటామని ప్రకటించారు. ఈ ప్రకటనపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణే స్పందిస్తూ.. ప్రతిష్ఠ వేడుకల్లో ఏవో చిన్న చిన్న లోపాలను విమర్శించకుండా అయోధ్య రామమందిరాన్ని సందర్శించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa