లక్షద్వీప్లో ప్రధాని మోదీ పర్యటనపై మాల్దీవులకు చెందిన మంత్రులు, ఇతర నేతలు చేసిన అభ్యంతరకమైన కామెంట్లతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే మాల్దీవులుకు చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన భారత్.. తన నిరసనను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే చైనా పర్యటకు వెళ్లి వచ్చిన మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ.. తమ దేశంలో ఉన్న భారత సైన్యం మార్చి 15 వ తేదీ లోపు తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేశారు. అయితే అధికారంలోకి రాగానే ఈ ప్రతిపాదన చేసిన మహ్మద్ మొయిజ్జూ.. ఇటీవల తలెత్తిన వివాదంతో మరింత స్వరం పెంచారు. ఈ క్రమంలోనే తాజాగా భారత్, మాల్దీవుల విదేశాంగ మంత్రలు భేటీ కావడం గమనార్హం.
ఉగాండా రాజధాని కంపాలాలో మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్తో భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. 2 రోజుల నాన్ అలైన్డ్ మూవ్మెంట్-నామ్ శిఖరాగ్ర సదస్సు కోసం వెళ్లిన ఇరు దేశాల మంత్రులు సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని జైశంకర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. కంపాలాలో మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ను కలిసి భారత్ -మాల్దీవుల మధ్య సంబంధాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం ఉపసంహరణపై జరుగుతున్న ఉన్నతస్థాయి సమావేశాలపైనా అభిప్రాయాలను పంచుకున్నట్లు వివరించారు. మాల్దీవుల్లో అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఉన్న మార్గాలపైనా మాట్లాడినట్లు తెలిపారు.
ఇక ఈ భేటీపై మాల్దీవులు మంత్రి మూసా జమీర్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. నామ్ సమ్మిట్లో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ను కలవడం సంతోషంగా ఉందని తెలిపారు. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ, మాల్దీవులలో కొనసాగుతున్న డెవలప్మెంట్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, సార్క్, నామ్ల సహకారంపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నట్లు వివరించారు. సార్క్, నామ్ల బలోపేతం, విస్తరణకు మాల్దీవుల సహకారం ఉంటుందని మూసా జమీర్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa