ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని శ్మశానానికి బీఆర్ఎస్ ఎంపీ నిధులు.. తెలంగాణ ఐఏఎస్ అధికారి రిక్వెస్ట్‌తో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2024, 08:30 PM

ఏపీలోని ఓ శ్మశానానికి తెలంగాణ ఎంపీ నిధులు కేటాయించారు. ఇదేంటి ఏపీకి తెలంగాణ ఎంపీ నిధులు ఇవ్వడం అనుకుంటున్నారా.. ఇదంతా నిజమే.. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు పెద్దమనసుతో స్పందించి నిధులు ఇచ్చారు. తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడి నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ స్వర్గధామం అభివృద్ధి చెందుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని కమిటీ సభ్యులు స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి రాజన్నదొర, అధికార పార్టీకే చెందిన అరకు ఎంపీని గతంలో సంప్రదించారు.


కానీ సరైన స్పందన లేకపోవడంతో.. దీంతో నిధులు సేకరించి అభివృద్ధి చేయాలని భావించారు. గ్రామం నుంచి వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్లను సంప్రదించారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కలెక్టరుగా పని చేస్తున్న సాలూరుకు చెందిన సుతాపల్లి వెంకటరావు దృష్టికి విషయం తీసుకెళ్లారు. వెంకటరావు ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌కు చెప్పి, నిధులు కోరారు. దీనిపై లింగయ్య యాదవ్ సానుకూలంగా స్పందించారు.‌


ఎంపీ లింగయ్య యాదవ్ వెంటనే రూ.10 లక్షలు కేటాయించారు. పుర పాలకవర్గం ఆమోదం మేరకు ఈ నిధులతో స్వర్గధామంలో సీసీ రోడ్డు, ఆధునికీకరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. అభివృద్ధిపై పక్క రాష్ట్ర నేతలకున్న శ్రద్ధ.. స్థానిక ప్రజాప్రతినిధులకు లేదా అంటూ పట్టణ ప్రజల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఎంపీ నిధులు కేటాయించడంతో పాలకవర్గ ఆమోదంతో పనులు చేపట్టామని పుర డీఈ, ఏఈలు శ్రీరామమూర్తి, సూరినాయుడు తెలిపారు. తెలంగాణ ఎంపీ లింగయ్య యాదవ్ నిధులు కేటాయించడం ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa