అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు కోసం 11 రోజులుగా ఉపవాసదీక్షలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ మహత్తర ఘట్టం పూర్తయిన వెంటనే ఫాస్టింగ్ విరమించారు. కోట్లాది మంది భక్తుల తరఫున ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నానని తెలిపిన మోదీ.. ఇందు కోసం కఠిన దీక్ష పాటిస్తున్నట్లు జనవరి 12న వెల్లడించారు. 11 రోజులుగా కేవలం కొబ్బరి నీళ్లను మాత్రమే స్వీకరించారు. ఎలాంటి ఘన ఆహార పదార్థాలను తీసుకోలేదు. అయోధ్యలో జనవరి 22న మధ్యాహ్నం బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసిన వెంటనే.. మోదీ తన ఉపవాస దీక్ష విరమించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరుల సమక్షంలో మోదీ ఉపవాసాన్ని విరమించారు.
పూజలో ఉపయోగించిన పాలతో చేసిన పానీయం ‘చరణామృత్’ను ప్రధాని మోదీకి తాగించారు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహారాజ్. అనంతరం ప్రత్యేక అనుష్ఠానం పాటించినందుకు మోదీని అభినందించారు. జనవరి 12న మహారాష్ట్రలోని నాసిక్ ధామ్లోని పంచవటిలో (కాలారామ్ ఆలయం) ప్రధాని మోదీ ఉపవాస దీక్ష ప్రారంభించారు. కేవలం దుప్పటి మాత్రమే వేసుకొని నేలపై నిద్రించారు. కొబ్బరి నీళ్లు మాత్రమే తాగారు. అనుష్ఠానంలో భాగంగా పాటించే నియమాల మేరకు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, యోగా, ధ్యానం చేయడం లాంటివి ఆచరించారు. ‘ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించే అదృష్టం దేవుడు నాకిచ్చాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రత్యేక అనుష్ఠానం పాటిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు.
రాముడు తన జీవితంలోని ముఖ్యమైన భాగాన్ని పంచవటి (నాసిక్ ధామ్)లో గడిపారని పురాణాల్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ గత 11 రోజులుగా.. రాముడి జీవితంతో సంబంధం ఉన్న అన్ని ఆలయాలను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి, తమిళనాడులోని రామేశ్వరం, తిరుచిరాపల్లి, ధనుష్కోటి, కేరళలోని గురువాయుర్ ఆలయాలను మోదీ సందర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa