ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూలీలతో వెళ్తోన్న ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 26, 2024, 05:49 PM

పల్నాడు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక బస్‌స్టాప్‌ వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో 13 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలోని బాధితులంతా వ్యవసాయ కూలీలే. తమ గ్రామానికి సమీపంలో ఉండే ప్రాంతంలో మిరప పంట కోతకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.


పోలీసుల కథనం ప్రకారం.. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు నాదెండ్ల మండలం అప్పాపురంలో మిరప పంట కోతలకు ఆటోలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో.. లింగంగుంట్ల బస్‌స్టాప్‌ జంక్షన్ వద్ద గణపవరం రోడ్డు నుంచి ఒక్కసారిగా చిలకలూరిపేట రహదారిలోకి వచ్చింది. ఇదే సమయంలో మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిలకలూరిపేట వైపు వస్తోంది. ఒక్కసారిగా ఆటో రావడంతో గమనించిన ఆర్టీసీ డ్రైవర్ తప్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అప్పటికే పరిస్థితి చేజారింది. బస్సు కింద పడి ఆటో నుజ్జయింది.


దీంతో యాకసిరి హనుమాయమ్మ (60) అనే మహిళ ఘటనా స్థలిలోనే మృతి చెందింది. ఆటో డ్రైవర్‌తో సహా గాయపడిన 14 మందిని చికిత్స కోసం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు గన్నవరపు శివపార్వతి (58), షేక్ హజరత్ వలీ (65) మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో గోరంట్ల శివకుమారి (60), సురుగుల కోటేశ్వరమ్మ (60) అనే మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మెరుగైన వైద్యం కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa