ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ ప్రమోషన్.. కీలక ప్రభుత్వ పదవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 08:53 PM

ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) ఛైర్మన్‌గా ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటివరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉన్న మెట్టు గోవిందరెడ్డి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేయనుండటంతో ఈ నియామకం జరిగినట్టు ఏపీఐఐసీ వర్గాలు భావిస్తున్నాయి.


జంకె వెంకటరెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం టికెట్ ఆశించారు. అయితే ఆయనకు అవకాశం దక్కలేదు.. మార్కాపురంనకు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా నియమించారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు ఇంఛార్జ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. మార్కాపురం టికెట్ తనకు దక్కకపోవడంతో జంకె వెంకటరెడ్డి నిరాశ ఎదురైంది. మార్కాపురంలో అసమ్మతికి అధిష్ఠానం తాత్కాలికంగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది. అందుకే జంకె వెంకటరెడ్డికి ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


2014లో సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న జంకెను 2019 ఎన్నికల్లో పక్కన పెట్టింది. కుందురు నాగార్జునరెడ్డికి టికెట్‌ కేటాయించింది. ఈసారి తనకు అవకాశం కల్పిస్తారని జంకె ఆశించారు. అధిష్ఠానం పట్టించుకోకుండా మార్కాపురం, గిద్దలూరు సిటింగ్‌ ఎమ్మెల్యేలను అటు, ఇటు మార్చింది. దీంతో జంకె తీవ్ర అసంతృప్తికి లోనై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు నామినేటెడ్‌ పదవి కేటాయించింది.


మరోవైపు ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీలో మరో ఆసక్తికర పరిణామం కనిపించింది. గత కొన్నాళ్లుగా అధిష్ఠానం తీరుపై అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రాంతీయ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితోపాటు కుమారుడు ప్రణీత్‌రెడ్డి, వియ్యంకుడు కుండా భాస్కర్‌రెడ్డితో కలిసి సీఎంవోకు వెళ్లారు. తొలుత సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డితో మాట్లాడి అనంతరం సీఎంను కలిశారు. జిల్లాలో పార్టీ స్థితిగతులపై సీఎం ఆరా తీసినట్లు తెలుస్తోంది.


ప్రాంతీయ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి పనిచేయాలని, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించినట్లు సమాచారం. ఒంగోలులో ఇళ్లపట్టాల పంపిణీకి హాజరవుతానంటూ ఈ నెల చివరి వారంలో రెండు తేదీలను సీఎం సూచించారు. సీఎంతో భేటీ అనంతరం తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి ఒంగోలు వచ్చారు. మొత్తానికి వైఎస్సార్‌సీపీ అధిష్టానం.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీలో కీలక మార్పులు చేస్తోంది. మరి ఈ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో కూడా చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa